అమరావతి : టీడీపీ హయాంలో దేవాలయాలకు చెందిన భూములు అన్యాక్రాంతమయ్యాయని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. కోట్ల రూపాయలు దోచుకున్నా చంద్రబాబు ప్రభుత్వం చూస్తూ కూర్చున్నదని చెప్పారు. పలు మఠాల్లో అక్రమాలు జరిగినా చర్యలు తీసుకోలేదన్నారు. ప్రస్తుతం ఏర్పాటైన ఏపీ ధార్మిక పరిషత్ ఇకపై ఇలాంటి అక్రమాలపై దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
దేవుడి మాన్యం భూములపై పూర్తి హక్కు దేవాదాయ శాఖకు మాత్రమే ఉంటుందని, ఆయా భూములపై వచ్చే ఫలసాయంపై మాత్రమే అర్చకులకు హక్కు ఉంటుందని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. దేవాదాయశాఖ పరిధిలో 4 లక్షల ఎకరాలకు పైగా భూములు ఉన్నాయని, కోర్టు వివాదాల్లో ఉన్న ఆలయ భూములు, కేసుల పురోగతి తెలుసుకునేందుకు త్వరలో వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు. టీడీపీ హయాంలో అన్యాక్రాంతమైన ఆస్తులు, కొన్ని మఠాల్లో జరిగిన అక్రమాలపై ఇవాళే ఏర్పాటుచేసిన ధార్మిక పరిషత్ చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖలో ధార్మిక పరిషత్ నిర్ణయాలే కీలకమన్నారు.
హిందు ధర్మ పరిరక్షణలో భాగంగా ప్రతీ గ్రామంలో ఒక ఆలయానికి ధూప, దీప నైవేద్యం చేపట్టేందుకు ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దేవాదాయ శాఖలో ఉద్యోగుల కొరత కారణంగా పరిపాలనా సౌలభ్యం కోసమే రెవెన్యూ ఉద్యోగులను దేవదాయ శాఖలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు.