జమ్మికుంట: దళితులు బాగుపడడం ఈటల రాజేందర్కు ఇష్టం లేదని, అందుకే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయించి మరీ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధు పథకాన్ని ఆపివేయించాడని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి 19వ వార్డులో కొప్పుల ఈశ్వర్ మంగళవారం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ తరఫున ప్రచారం నిర్వహించారు. మునిసిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న, గెల్లు శ్రీనివాస్యాదవ్ సతీమణి శ్వేతతో కలిసి ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. నిరుపేదలైన దళితులు గొప్పగా ఎదిగితే తన రాజకీయం నడవదని, ఇక టీఆర్ఎస్కు ఎదురే ఉండదని ఈటల రాజేందర్ భయపడ్డాడని అన్నారు. దళితబంధు పథకాన్ని మొదటినుంచీ ఆపేందుకు ఈటల కుటిల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఎంతో ప్రేమతో ప్రారంభించిన ఈ పథకాన్ని ఈటల రాజేందర్ కేవలం 15 రోజులు మాత్రమే ఆపగలడని, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటల ఆటలు చెల్లవన్నారు. దళితబంధు పథకం ద్వారా రాష్ట్రంలోని దళితుల తలరాత మారిపోతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు, అపోహలు అక్కర్లేదన్నారు. ముఖ్యమంత్రి ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసి తీరుతడని, దళితుల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకువస్తడని చెప్పారు.
అభివృద్ధి,సంక్షేమంలో తెలంగాణను మించిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగలేదని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తున్నదని, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. హుజూరాబాద్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇదే రీతిలో ముందుకు సాగాలంటే కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్యాదవ్నే గెలిపించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలను కోరారు.
అన్నింటా తెలంగాణ అభివృద్ది.. : గెల్లు శ్వేత
తెలంగాణ వస్తే చీకట్లు కమ్ముకుంటయని ఆనాడు సీఎంగా ఉన్న కిరణ్కుమార్రెడ్డి అన్నారని, కానీ అది నిజం కాదని ఆచరణలో తేలిపోయిందని గెల్లు శ్వేత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందిందని తెలిపారు. అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. మన రాష్ట్రంలో అమలవుతున్న అద్బుత పథకాలు మరే రాష్ట్రంలో కనిపించవన్నారు. హుజూరాబాద్ అభివృద్ది కోసం కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని శ్వేత కోరారు. వారివెంట టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు టంగుటూరి రాజ్కుమార్, కౌన్సిలర్లు మల్లయ్య, రాము, దిలీప్, టీఆర్ఎస్ నాయకులు సమ్మిరెడ్డి, కశ్యప్రెడ్డి, కోటి, తదితరులున్నారు.