Minister Jagadish Reddy | రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ పనిచేస్తుందని.. కేసీఆర్ పాలనలో కార్మికులు, కర్షకులు, చేతివృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నిండాయని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట సుమంగళి ఫంక్షన్ హాలులో నియోజకవర్గ స్థాయి బీఆర్టీయూతో పాటు అనుబంధ సంఘాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మంత్రికి మద్దతుగా నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో కార్మికులు తరలివచ్చారు.
ఈ సందర్భంగా మూడోసారి జగదీశ్రెడ్డిని గెలిపించి.. గులాబీ జెండా ఎగురవేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో కార్మికులకు బీమా సౌకర్యంతో పాటు ఇతర సంక్షేమ పథకాలన్నీ వర్తించేలా కృషి చేశామన్నారు. అతి తక్కువ కాలంలో అభివృద్ధి సాధించడంతో పాటు కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆత్మగౌరవాన్ని మరింత పెంచుతున్నామన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు కార్మికులకు పని దొరికేది కాదని.. ఎక్కడ చూసినా పచ్చని పంటలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెంది ఉపాధి లభిస్తుందన్నారు.
కాంగ్రెస్ చెప్పే మాటలు వింటే మళ్లీ పదేండ్లు వెనక్కిపోయి కరువు విలయతాండవం చేస్తుందన్నారు. కార్మికులు, కర్షకులు ఇతర పార్టీలకు ఓటు వేయకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్కు ఓటు వేసి.. సూర్యాపేట నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో జిల్లా కేంద్రంగా మారిన సూర్యాపేట జిల్లాలో మెడికల్ కళాశాల , ఇతర జిల్లా కార్యాలయాలు ఏర్పాటుకావడంతో పాలన చేరువైందని.. ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయన్నారు.
ఐటీ హబ్తో పాటు పెద్ద వ్యాపార సంస్థలు, మాల్స్, మల్టీప్లెక్స్ ఇలా అన్ని రకాల వ్యాపార సంస్థలు ప్రశాంత వాతావరణంలో తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగ యాదవ్, కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, చిలువేరు ప్రభాకర్, వెంపటి గురూజీ, పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్ శివశంకర్, శివరాం పాల్గొన్నారు.