నల్లగొండ : రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విధంగానే దేశాన్ని అభివృద్ధి చేయాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ సారథ్యంలో దేశాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం అనేది దేశ ప్రజల కోరిక, అవసరం కూడా అని తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ గొప్పగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దారని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. ఓట్ల, క్షుద్ర రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ఒకట్రెండు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా పాలన కొనసాగిస్తుందన్నారు. 2014కు కంటే ముందు మేనిఫెస్టోలో చెప్పిన వాటిని మోదీ సర్కార్ విస్మరించిందని పేర్కొన్నారు. రూపాయి విలువ పడిపోయిందన్నారు. మత విద్వేషాలతో ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావలా మారిందన్నారు. ఈ నేపథ్యంలో దేశానికి మరో ప్రత్యామ్నాయం కావాలన్నారు. దేశాన్ని పాలించే శక్తి ఉన్న నేతగా కేసీఆరే కనిపిస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ కేసీఆర్ను వెన్నంటి ఉండాలని కోరారు. అందుకోసం ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. గవర్నర్ ద్వారానే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని నడుస్తాయి. కానీ తన ప్రభుత్వాన్ని తానే వ్యతిరేకిస్తూ మాట్లాడడం ఎంత వరకు సమంజసం. గవర్నర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.