నల్లగొండ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు ఏ అంశం లేకనే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని రాష్ట్ర విద్యుద్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలో మంగళవారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను ప్రజలు అసహ్యంచుకుంటున్నారన్నారు. యావత్ ఉద్యోగ లోకం మొత్తం అధికార టీఆర్ఎస్ వైపే ఉందన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు తధ్యం అని తెలిపారు. తెలంగాణలో ఆకలి అన్నదే లేదన్నారు. సీఎం కేసీఆర్ ఆకలిని పారద్రోలారన్నారు. 24 గటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తూ వ్యవసాయాన్ని పండుగల మార్చారన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా వేల కంపెనీలను ఏర్పాటు చేసి ప్రైవేటు రంగంలో 15 లక్షల మందికి ఉపాధి కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు.
ప్రధాని మోడీ దేశ ప్రజలకు చేసిందేమి లేదన్నారు. కాగా ఉన్న ఉద్యోగాలను సైతం తొలగించిన ఘనుడన్నారు. విదేశాల్లో ఉన్న నల్లడబ్బును వెనక్కి తెప్పిస్తా అని చెప్పి ప్రజలను మోసం చేసిండు. సీఎం కేసీఆర్ పాలనతో పోటీ పడే దమ్మున్న, విజన్ ఉన్న నాయకుడు దేశంలోనే లేడన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీ రామరక్ష అన్నారు. ప్రతిపక్షాలు విజ్ఞతతో మాట్లాడటం నేర్చుకోవాలన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల వాలే కష్టించి పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు.