జమ్మికుంట: రైతులను కారెక్కించే టీఆర్ఎస్ పార్టీ కావాల్నా..? రైతులపైకి కారెక్కించే బీజేపీ కావాల్నా?.. మీరే తేల్చుకోండి అని హుజూరాబాద్ ప్రజలనుద్దేశించి మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. జమ్మికుంట మండలంలోని మాచాన్పల్లి గ్రామంలో ఆదివారం ఆయన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీటీసీ శ్యాంతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. బీజేపీకి ఓటేస్తే ఏం ప్రయోజనం కలుగుతుందో హుజూరాబాద్ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. బీజేపీ మీటింగ్ అంటేనే నాలుగు తిట్లు.. నలుగురిని రెచ్చగొట్టడం..నాలుగు ఓట్లు పొందడం అని విమర్శించారు. ఈటల రాజేందర్ తన స్వార్థంకోసం మాత్రమే రాజీనామా చేశాడని, జమ్మికుంటకు మెడికల్ కాలేజీ కావాలని, హుజూరాబాద్ జిల్లా కావాలనే డిమాండ్తో రాజీనామా చేయలేదని హరీశ్రావు అన్నారు. ఈటల రాజేందర్ హైదరాబాద్లో మెడికల్ కాలేజీ పెద్దగా కట్టుకున్నాడని, మరి ఇక్కడ ప్రజలపై ప్రేమ ఉంటే జమ్మికుంటలోనే ఆ కాలేజీ కట్టొచ్చు కదా? అని ప్రశ్నించారు.
ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక రెండేళ్ల కాలానికి మాత్రమేనని, ఆ కాలంలో రాష్ట్రంలో అధికారంలో ఉండేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మంత్రి హరీశ్రావు చెప్పారు. సీఎం కేసీఆర్ మాట ఇస్తే తప్పరని తెలిపారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే రూ. 200 పింఛన్ను వెయ్యి రూపాయలు చేస్తా అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, గెలువంగనే చేసి చూపించారన్నారు. మళ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే వెయ్యి రూపాయల పింఛన్ను రూ. 2016కు పెంచుతా అని చెప్పారని, పెంచి నెలనెలా ఠంచన్గా ఇస్తున్నారని తెలిపారు. అన్నదాతలకు ఎకరాకు ఇస్తున్న రూ. నాలుగు వేల రైతుబంధును రూ. 5 వేలు చేస్తా అని చెప్పి.. చేసిండా? లేదా? అని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి కింద మొదట రూ. 50వేలు ఎస్సీలకే ఇచ్చారని, ఆ తర్వాత తమను గెలిపిస్తే రూ. లక్షా నూట పదహార్లు అందరికీ ఇస్తా అని కేసీఆర్ హామీ ఇచ్చారని, అన్నట్లుగానే చేసి చూపించారని మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. కేసీఆర్ కిట్ ఇచ్చి పేదింటి ఆడబిడ్డకు ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా కాన్పు చేయడంలేదా? అని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన పార్టీ దేశంలో ఏదైనా ఉందా? అని అడిగారు. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని, ఆ నీటితో అన్నదాతలు యాసంగిలో కూడా పంట పండిస్తున్నారని హరీశ్రావు అన్నారు.
ఈటల రాజేందర్ చేరిన పార్టీ బీజేపీ అని, ఆ పార్టీ బాయిల కాడ మీటర్లు పెడతామని చెబుతున్నదని హరీశ్రావు పేర్కొన్నారు. ఆంధ్రా సీఎం ఇప్పటికే మీటర్లు పెట్టడం ప్రారంభించాడని, కానీ తన ప్రాణం పోయినా బాయికాడ మోటార్లకు మీటర్లు పెట్టనినయ్యనని సీఎం కేసీఆర్ అంటున్నారని తెలిపారు. బాయికాడ మీటర్లు పెడ్తామని ఈటల పార్టీ అంటోందని, కానీ ఉచిత కరెంటు ఇస్తున్నది గెల్లు శ్రీనివాస్యాదవ్ పార్టీ అని అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలతో అన్నదాత ఉసురుపోసుకుంటున్న బీజేపీలో ఈటల రాజేందర్ చేరాడని, ఆయనకు ఓటుతోనే తగిన బుద్ధి చెప్పాలని మంత్రి హరీశ్రావు ప్రజలకు సూచించారు. కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపిస్తే హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యత తాను చూసుకుంటానన్నారు.