‘తెలంగాణ ప్రభుత్వం 2014 ఆగస్టులో 36 లక్షల మందికి రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిందని 2021 మార్చి 12న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాజ్యసభలో ప్రకటించారు. రెండో విడతలో ఇప్పటివరకు 5.43 లక్షల మందికి రుణ మాఫీ చేశాం. మొత్తంగా 55.4 శాతం మంది రైతులు లబ్ధి పొందారు. రైతుల ఆత్మహత్యలపైనా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. 2019-2021 మధ్య తెలంగాణలో రైతు ఆత్మహత్యలు లేవని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేసింది.
– మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ పర్యటన సందర్భంగా అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రేషన్ షాపుల్లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫొటో పెట్టారా? అని సూటిగా ప్రశ్నించారు. కేంద్రం సమాఖ్య విలువలను కాలరాస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రానికి వచ్చి మూడు ఆరోపణలు, ఆరు అబద్ధాలు ఆడి రాజకీయం చేస్తానంటే తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరించారు. ప్రజలు టీఆర్ఎస్పై, సీఎం కేసీఆర్ పాలనపై, ప్రభుత్వ పథకాలపై పూర్తి స్పష్టతతో ఉన్నారని చెప్పారు. ఈ మేరకు మంత్రి హరీశ్రావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని తెలిసినా నిర్మల పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. విభజన హామీలు అమలు చేయకపోవడం, తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన రూ.7,103 కోట్లు ఇవ్వకపోవడం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల చేయకపోవడం, ఐటీఐఆర్, నిమ్జ్ రద్దు, మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాలయాలు మంజూరు చేయకపోవడం వంటివి వివక్ష కాదా? అని ప్రశ్నించారు.
మన్మోహన్ ఫొటో పెట్టారా?
పథకాల్లో కేంద్ర నిధులను వినియోగిస్తే మోదీ ఫొటో పెట్టాల్సిందేనని నిర్మలా సీతారామన్ మాట్లాడటం విచిత్రంగా ఉన్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆయన ఫొటో పెట్టారా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలున్న రాష్ట్రాలపై ఇలాంటి ఒత్తిడి తేవడం ఎంతవరకు సబబో ఆలోచించుకోవాలని సూచించారు. ‘మోదీ హయాంలో అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలను రద్దు చేశారు. ఉన్న పథకాల్లో కేంద్రం నిధుల వాటా తగ్గించి, రాష్ట్రాల వాటా పెంచారు. ఇందులో కొన్ని పథకాల లక్ష్యాలు ఆయా రాష్ట్రాల ప్రయోజనాలకు తగినట్టు లేనేలేవు. అనవసరమైన పథకాలు అమలు చేస్తూ, రాష్ట్రాల వాటా పెంచి మాపై భారం వేయడం తప్ప కేంద్రం రాష్ట్రాలకు చేసిన మేలు ఏమిటి?’ అని ప్రశ్నించారు. పనికి ఆహార పథకం వంటి మంచి పథకాలకూ కొర్రీలు పెట్టి, నిధులు తగ్గించి కొత్త నిబంధనలు పెడుతూ నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ పథకాల పేరుతో రాష్ర్టాలపై పెత్తనం చేయడం కాదా? అని నిలదీశారు.
రుణ పరిమితి మీకు వర్తించదా?
ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని పునఃసమీక్షించాలన్న 15వ ఆర్థిక సంఘం సిఫారసు గురించి మీడియా ప్రశ్నిస్తే నిర్మల తప్పించుకొనే ప్రయత్నం చేశారని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ‘రాజ్యాంగం ప్రకారం రుణాలను నియంత్రించే హకు కేంద్రానికి ఉన్నదని మీరు అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం పరిధి దాటి ఎలా అప్పులు చేస్తున్నది? మీకు రాజ్యాంగం ఏమైనా ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చిందా?’ అని ప్రశ్నించారు. ఉచితాలు వద్దంటూ పేదల నోట్లో మట్టి కొట్టేందుకు నిర్మల ప్రయత్నించారని విమర్శించారు. కార్పొరేట్లకు చెందిన రూ.లక్షల కోట్ల రుణాలను ఎవరి ఆమోదంతో రద్దు చేశారో దేశ ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం జీఎస్డీపీ వృద్ధి రేటులో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని, సొంత పన్ను రాబడిలో అత్యధిక వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. అప్పులను తీర్చగలిగే స్థోమత ఉన్న రాష్ట్రం తెలంగాణ అని స్పష్టంచేశారు. ప్రగతి శీల రాష్ట్రాలు రుణాలు తీసుకోకుండా అడ్డంకులు సృష్టించడం రాజకీయ ప్రేరేపిత చర్య కాదా? అని ప్రశ్నించారు.
ఆర్థిక మందగమనంపైనా అవాస్తవాలు
దేశంలో ఆర్థిక మందగమనం (రెసిషన్) ఉండదని నిర్మలా సీతారామన్ చెప్పడం వాస్తవ విరుద్ధమని మంత్రి హరీశ్రావు అన్నారు. ‘స్థిర ధరల వద్ద జీడీపీ వృద్ధి 2016-17లో 8.26% ఉంటే.. 2018-19లో 6.53%కి.. 2019-20లో 3.66%కి క్షీణించడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం కాదా? దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి బలహీనపడటం, ద్రవ్యోల్బణం వంటి ఇతర సమస్యలు దేనికి సంకేతాలు?’ అని నిలదీశారు. సెస్ రూపంలో వచ్చే నిధులను కేంద్రం తనకు ఇష్టమైన రాష్ట్రాలకు ఇస్తూ, అనుకూలంగా లేని రాష్ట్రాలకు మొండి చేయి చూపుతున్నదని మండిపడ్డారు. 2022-23 కేంద్ర బడ్జెట్ ప్రకారం ఆదాయంలో సర్ చార్జీలు, సెస్లు కలిపి దాదాపు 20% ఉన్నాయని, దీంతో చట్టబద్ధంగా రాష్ట్రాలకు రావాల్సిన 41% పన్నుల్లో వాటా దకడం లేదని, 29.6% మాత్రమేనని వస్తున్నదని తెలిపారు.
డీపీఆర్ లేకుండానే అనుమతులిచ్చారా?
కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేయలేదని నిర్మల పచ్చి అబద్ధం చెప్పారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. డీపీఆర్ సమర్పించకుండానే కేంద్ర జల సంఘం అనుమతులు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. కేంద్ర జల సంఘం అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాతే కేంద్ర జల వనరుల శాఖకు చెందిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఈ ప్రాజెక్టుకు రూ.80,190 కోట్లకు అనుమతి జారీ చేసిందని గుర్తు చేశారు. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కోసం 2018 ఆగస్టులో కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు సమర్పించామని, వారు కోరిన వివరాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందించినా నాలుగేండ్లుగా కావాలనే క్లియరెన్స్ ఇవ్వలేదని విమర్శించారు. క్లియరెన్స్ ఇస్తే ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇవ్వాల్సి వస్తుందనే కుట్రతోనే పెండింగ్ పెట్టారని ఆరోపించారు. అదనంగా ఒక టీఎంసీని ఎత్తిపోయడానికి అవసరమయ్యే ఖర్చును కూడా జతచేసి సమగ్ర డీపీఆర్ను కేంద్ర జల సంఘానికి మే నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం అందించిందని, దాన్ని ఆమోదించి ఇటీవలే జీఆర్ఎంబీ పరిశీలనకు పంపిందని తెలిపారు. ఈ విషయాలేవీ తెలుసుకోకుండా మాట్లాడటం నిర్మల హోదాకు తగదని హితవు పలికారు. నిధుల వినియోగంలో ఎలాంటి అవినీతి జరుగలేదని గత ఏడాది జూలై 22న కేంద్ర జల శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లోక్సభలో ప్రకటించారని గుర్తుచేశారు.
55.4 శాతం మంది రైతులకు రుణమాఫీ
తెలంగాణలో వంద మంది రైతుల్లో ఐదుగురికి మాత్రమే రుణ మాఫీ అయ్యిందంటూ నిర్మల అర్ధసత్యాలు మాట్లాడారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. ‘తెలంగాణ ప్రభుత్వం 2014 ఆగస్టులో 36 లక్షల మందికి రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిందని 2021 మార్చి 12న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాజ్యసభలో ప్రకటించారు. రెండో విడుతలో ఇప్పటివరకు 5.43 లక్షల మందికి రుణా మాఫీ చేశాం. మొత్తంగా 55.4 శాతం మంది రైతులు లబ్ధి పొందారు. రైతుల ఆత్మహత్యలపైనా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. 2019-2021 మధ్య తెలంగాణలో రైతు ఆత్మహత్యలు లేవని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేసింది. 2018-19 నుంచి 9 వ్యవసాయ సీజన్లలో 65 లక్షల మంది రైతులకు రూ.57,880 కోట్ల రైతు బంధు అందించాం. ఒకో వ్యవసాయ పంపుసెట్కు ఉచిత విద్యుత్తు కోసం ప్రభుత్వం ఏటా రూ.18,167 భరిస్తున్నది. ఇలా 25.78 లక్షల కనెక్షన్లకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎకడైనా ఇన్ని వేల కోట్లు ఖర్చు చేశారా?’ అని ప్రశ్నించారు.