అద్భుతాలు ఆవిష్కరిస్తున్నం
కాళేశ్వరం, మల్లన్నసాగర్లే నిదర్శనం
కమీషన్లు బొక్కిన చరిత్ర కాంగ్రెస్ నేతలది
వారి మౌనంతోనే తెలంగాణకు అన్యాయం
ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు బీజేపీ కుట్రలు
అసెంబ్లీలో ధ్వజమెత్తిన మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, మార్చి14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా తెలంగాణకు చేసిన విద్రోహాన్ని, చారిత్రక తప్పిదాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సరిదిద్దుతున్నారని, ఖర్చు పెట్టిన ప్రతిపైసా సద్వినియోగమయ్యేలా ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రాజెక్టులు కట్టకుండానే కమీషన్లు బొక్కిన కాంగ్రెస్, బీజేపీ నేతలకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికహక్కు లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాస్తవాలను ఒప్పుకోలేక ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలకు దమ్ముంటే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయహోదా, నీటి హక్కుల కోసం కేంద్రాన్ని నిలదీయాలని సవాల్ చేశారు. సోమవారం అసెంబ్లీలో నీటి పారుదలశాఖ పద్దుపై జరిగిన చర్చలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కేసీఆర్ నేతృత్వంలో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నామని, అందుకు పంటల దిగుబడే నిదర్శనమని చెప్పారు.
పది జిల్లాలకు వరప్రదాయిని మల్లన్నసాగర్
కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నది దాదాపు 300 కిలోమీటర్ల మేర సజీవధారగా మారిందని హరీశ్రావు చెప్పారు. ఎస్సారెస్పీ చరిత్రలో లేనివిధంగా 14 లక్షల పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందుతున్నదని, మల్లన్నసాగర్ పది జిల్లాలకు వరప్రదాయినిగా మారిందని వివరించారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అంది వలసలు వాపస్ వస్తున్నాయని అన్నారు. గతంలో నిర్వాసితులకు రూ.1.25 లక్షల పరిహారాన్ని ఇస్తే తెలంగాణ ప్రభుత్వం రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెల్లిస్తున్నదని వివరించారు.
గోదావరి-కావేరి అనుసంధానాన్ని ఒప్పుకోం
బీజేపీ నేతల తీరు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే చందంగా ఉన్నదని హరీశ్రావు ఎద్దేవాచేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తుంటే, అడ్డుకొనేందుకు కాషాయ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వవద్దంటూ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించినా కేంద్రం పైసా విదల్చలేదని అన్నారు. రాష్ర్టానికి నీటి వాటా తేల్చడంలేదని, ట్రిబ్యునల్ను ఏర్పాటుచేయడం లేదని, ఒక్క ప్రాజెక్టుకూ జాతీయహోదా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ నీటి వాటా తేలే వరకు గోదావరి-కావేరి అనుసంధానాన్ని ఒప్పుకొనేది లేదని స్పష్టంచేశారు. రాష్ట్ర బీజేపీ తమాషా చేస్తే, కేంద్ర బీజేపీ చూస్తూ ఉంటుందని విమర్శించారు.
సాగర్ ఆయకట్టు కోసం సీమ ఎత్తిపోతలకు స్టే
నాగార్జునసాగర్ ఆయకట్టును కాపాడుకోవడానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న సీమ ఎత్తిపోతల పనుల నిలిపివేతకు స్టే తీసుకొచ్చామని హరీశ్రావు వెల్లడించారు. శాసనసభలో ఆర్థిక బిల్లుల ఆమోదం సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీళ్లు రాకుండా ఏపీ ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మిస్తున్నదని కాంగ్రెస్ సభ్యులు చెప్పడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. పోతిరెడ్డిపాడుకు ఎవరి హయాంలో అనుమతిచ్చారని నిలదీశారు. పోతిరెడ్డిపాడును నిరసిస్తూ ఆరుగురు టీఆర్ఎస్ మంత్రులు వైదొలిగిన విషయం మరిచిపోయారా?అని భట్టిని మంత్రి ప్రశ్నించారు. విభజన చట్టంలో కాంగ్రెస్ గోదావరి, కృష్ణా యాజమాన్య బోర్డుల ఏర్పాటు అంశాన్ని చేర్చడం వల్లనే ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.77,852 కోట్లు ఖర్చు చేసిందని, కేంద్రం నయా పైసా ఇవ్వలేదని అన్నారు.
కాంగ్రెస్’ రాష్ట్రాల్లో రెట్టింపు అప్పులు
తెలంగాణ కంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రెట్టింపు అప్పులు చేశారని హరీశ్రావు చెప్పారు. దేశంలో అతి తక్కువ అప్పులు చేసిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకు ఇప్పటివరకు ఉన్న నాలుగు శాతం అప్పుల పరిమితిని ఐదుశాతానికి పెంచుతూ ఎఫ్ఆర్బీఎం చట్ట సవరణ బిల్లును సోమవారం శాసనసభ ఆమోదించింది. బిల్లుపై చర్చ లో కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో అప్పుల పరిమితిని పెంచడం సరికాదని పేర్కొన్నారు. మంత్రి హరీశ్రావు స్పందిస్తూ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) రేటులో మొన్నటి వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్లో 49 శాతం, ఛత్తీస్గఢ్లో 28.6 శాతం, రాజస్థాన్లో 42.6 శాతం అప్పులు తీసుకున్నాయని గుర్తుచేశారు. స్థూల జాతీయోత్పత్తి రేటులో కేంద్రం చేసిన అప్పులు 62 శాతం ఉన్నాయని, కానీ జీఎస్డీపీ రేటులో తెలంగాణ చేసిన అప్పులు 27 శాతం మాత్రమేనని వెల్లడించారు.
కమీషన్లు బొక్కిన చరిత్ర కాంగ్రెస్ది
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల మౌనమే తెలంగాణకు జరిగిన అన్యాయాలకు కారణమని హరీశ్రావు ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు కట్టకుండానే సర్వేలు, మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట రూ.కోట్లు మింగిన కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికహక్కు లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కట్టని ప్రాజెక్టుల వ్యయాన్ని కూడా రెండింతలు చేసిన అవినీతి చరిత్ర కాంగ్రెస్దేనని మండిపడ్డారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండానే దాదాపు రూ.1,500 కోట్లు కమీషన్లుగా దండుకొన్నారని, 19 నెలల్లోనే వ్యయాన్ని రూ.17,800 కోట్ల నుంచి రూ.38,500 కోట్లను పెంచారని విమర్శించారు.
కేంద్రం సహకరించకున్నా మెడికల్ కాలేజీలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 12 కొత్త కాలేజీలకు అనుమతులు మంజూ రు చేసిందని పేర్కొన్నారు. వీటిలో 4 ప్రారంభమయ్యాయని, మరో 8 కాలేజీలను ఈ విద్యాసంవత్సరంలో ప్రారంభించనున్నట్టు వివరించారు. వచ్చే ఏడాది మరో 8 వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తద్వారా దేశంలోనే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటుచేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దకుతుందని పేర్కొన్నారు. 2014లో 700 మాత్రమే ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య రాబోయే విద్యా సంవత్సరంలో 2,850కు పెరుగుతుందని వివరించారు. సోమవారం ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, మర్రి జనార్దన్రెడ్డి, సంజయ్కుమార్, శంకర్నాయక్, గాదరి కిశోర్, పోడెం వీరయ్య అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్రావు సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 171 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన కేంద్రం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకుండా అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం మంజూరు చేసిన మెడికల్ కాలేజీలకు రూ.200 కోట్లు గ్రాంట్గా ఇస్తుందని, రాష్ట్రం పంపిన ప్రతిపాదనలను పట్టించుకోలేదని విమర్శించారు.
త్వరలో 91 బస్తీ దవాఖానల ఏర్పాటు
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 259 బస్తీ దవాఖానలు ఉన్నాయని, త్వరలో మరో 91 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామని సభ్యులు అడిగిన ప్రశ్నలకు హరీశ్రావు సమాధానమిచ్చారు. నిజామాబాద్, వరంగల్ నగరాల్లో కూడా బస్తీ దవాఖానలు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.
1 నుంచి హరితనిధి అమలు;ఉద్యోగుల వేతనాల నుంచి జమ
హరితనిధి ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని, ఉద్యోగుల ఏప్రిల్ నెల జీతం నుంచి జమలు మొదలవుతాయని మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఇందుకు సంబంధిత శాఖలు అంతర్గత ఉత్తర్వుల ద్వారా పనిని ప్రారంభించాలని ఆదేశించారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రి హరీశ్రావు అధ్యక్షతన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. జీవో ప్రకారం కంపెనీలు, షాపులు, ఎస్టాబ్లిష్మెంట్ల నుంచి మొత్తం హరితనిధికి జమయ్యేలా చూడాలని ఆదేశించారు.
ఆర్థికశాఖ పద్దు 45,532 కోట్లకు ఆమోదం
ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్, ట్రెజరీలు, ప్రణాళికశాఖకు కలిపి రూ.45,532 కోట్లతో మంత్రి హరీశ్రావు ప్రతిపాదించిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
మార్కెట్ కమిటీ సభ్యుల సంఖ్య 18కి పెంపు
మార్కెట్ కమిటీ సభ్యుల సంఖ్యను 14 నుం చి 18కి పెంచుతూ చట్టసవరణ చేశారు. మంత్రి నిరంజన్రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లును ఆసెంబ్లీ ఆమోదించింది. మార్కెట్ కమిటీల పదవీకాలాన్ని రెండు నుంచి మూడు సంవత్సరాలకు పెంచారు.