హైదరాబాద్ : బీజేపీ అంటేనే ఝూటా ఔర్ జుమ్లా అంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. మునుగోడులో గెలిస్తే రూ.3వేల పింఛను ఇస్తామని చెబుతున్న బీజేపీ నేతలు.. ఆ హామీని తెలంగాణవ్యాప్తంగా అమలు చేస్తామని పీఎం మోదీ, కేంద్రమంత్రి అమిత్షాతో చెప్పించాలని.. లేదంటే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు మాటలు ఝూటా, జుమ్లా మాటలని.. గతంలో దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలైందా? అంటూ నిలదీశారు.
తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్దతు ధరపై నరేంద్రమోదీ రైతులకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదని, రైతు నల్లా చట్టాలను రద్దు చేసి.. జాతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పి ఏడాది గడుస్తుందన్నారు. మద్దతు ధరకు చట్టబద్దత తీసుకొస్తామని చెప్పిన ప్రధాని హామీ ఇప్పటి వరకు అమలు కాలేదని గుర్తు చేశారు. ప్రధాని మాటలకే దిక్కు లేకుంటే మునుగోడులో బీజేపీ నాయకులు ఇచ్చే మాటలకు విలువేంటని.. వాటికి దిక్కు ఎవరని ప్రశ్నించారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధుల సాయం చేయాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం ఒక్క పైసా సాయం చేయలేదన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మునుగోడులో ఫ్లోరైడ్ లేని తాగునీటిని సరఫరా చేయకుంటే నో మ్యాన్ జోన్గా మారుతోందని హెచ్చరించిందని.. కాంగ్రెస్లో ఉన్నపుడు మంత్రులుగా, కీలక నేతలుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఫ్లోరైడ్ సమస్యను ఎందుకు పరిష్కరించలేదని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించారన్నారు.
నల్లగొండకు నీళ్లు ఇవ్వని బీజేపీకి మునుగోడులో ఓటు అడిగే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. 8సంవత్సరాల నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృష్ణా జలాల్లో వాటా తేల్చకపోవడంతో నల్లగొండ, మునుగోడుకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. కోర్టులో కేసు ఉపసంహరించుకోగానే వాటా తెలుస్తామని చెప్పారని, కేసు ఉపసంహరించుకొని కూడా పది నెలలు కావస్తున్న ఇంత వరకు కేటాయింపులు చేయలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచే బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తోందని, తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించే విధంగా తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారన్నారు.
‘నల్లగొండ జిల్లా మీద… మునుగోడు మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న ప్రేమ బీజేపీ నేతలకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎందుకు ఉంటుంది..?’ అంటూ ప్రశ్నించారు. ఫ్లోరోసిస్ను మునుగోడు నుంచి పారదోలింది కేసీఆర్ కాదా? అంటూ నిలదీశారు. సూర్యాపేట, నల్గొండకు మెడికల్ కాలేజీలు ఇచ్చామని, దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే ఒక్క కాలేజీనైనా తెలంగాణకు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. రావి నారాయణ రెడ్డి, ధర్మ భిక్షం లాంటి నాయకులు ప్రాతినిధ్యం వహించిన నల్గొండ లాంటి జిల్లాలో బీజేపీ ఆటలు సాగవని మంత్రి హరీశ్ రావు అన్నారు.
మునుగోడు ఎన్నికల్లో ‘రాజగోపాల్ రెడ్డి అహంకారం గెలవాలో..? ప్రజల ఆత్మ గౌరవం గెలవాలో ఓటర్లు ఆలోచించాలి’ అని మంత్రి హరీశ్ అన్నారు. మునుగోడు శాసనసభకు రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నిక ఎందుకు తెచ్చారు..? రాజీనామా దేని కోసం చేశారు..? ప్రజల మీద ప్రేమతోనా.. బీజేపీ ఇచ్చే కాంట్రాక్టులు.. డబ్బుల కోసమా..? రాజగోపాల్ రెడ్డిది ఆత్మ గౌరవ పోరాటం కాదు.. ఆస్తులు పెంచుకునే ఆరాటమే’ అని మంత్రి తేల్చి చెప్పారు. బీజేపీ చెప్పే అబద్దాలు మునుగోడులో నడువవని, మునుగోడులో బీజేపీ నాయకులు గతంలో బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలు, వాస్తవాల వీడియోలను ప్రతి ఇంటింటికి చేరుస్తామన్నారు.
రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం ఉప ఎన్నిక తెచ్చారన్నారు. ‘రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఒకే ఒక్క వ్యక్తికి మేలు జరుగుతుంది. అదే ప్రభాకర్ రెడ్డి గెలిస్తే మునుగోడు ప్రజలకు అభివృద్ధి జరుగుతుందని, నియోజకవర్గానికి న్యాయం జరుగుతుంది. ప్రభాకర్ రెడ్డి గెలుపు.. మునుగోడు అభివృద్ధికి మలుపు’ అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దేశం పరువు పోయే విధంగా బీజేపీ పాలన ఉందని, గ్లోబల్ హాంగర్ ఇండెక్స్ లో మన స్థానం 107కి దిగజారిందని, ఇందుకేనా బీజేపీకి ఓటు వేయాలని హరీశ్రావు ప్రశ్నించారు. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లా దేశ్ కన్నా దేశంలో అధ్వాన్నంగా పరిస్థితులు దిగజారాయని విమర్శించారు. బీజేపీ ఒక్క ఓటు రెండు రాష్ట్రాలంటూ కాకినాడ తీర్మానం తీసుకువచ్చిందని, అరు
మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు లాభం, రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఆయనకు లాభమని హరీశ్రావు అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ముందు నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఇప్పుడు 40లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, ఇంత పంట ఉత్పత్తి పెరగడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీరు, ఉచిత విద్యుత్ సరఫరా చేయడమే కారణమన్నారు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా ఐదు లక్షల వ్యవసాయ మోటార్లు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో రైతుబంధు లబ్ధిదారులకు అత్యధికంగా ఉన్నది మునుగోడులోనే అని తెలిపారు. ఉచిత విద్యుత్ ద్వారా ఈ రైతులందరు లబ్ధిపొందుతున్నారని అన్నారు. జిల్లాలో బత్తాయి, నిమ్మ మార్కెట్ను ఏర్పాటు చేశామన్నారు. నల్గొండ జిల్లాలో యాదాద్రి పవర్ ప్లాంటును ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ నిధులతో దేశం ఆశ్చర్యపోయే విధంగా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాన్ని తీర్చిదిద్దామన్నారు. కాళేశ్వరం తొలి ఫలితం నల్గొండ జిల్లాకే దక్కిందన్నారు. ఎస్ఆర్ఎస్పీ రెండో దశ ద్వారా చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందించినట్లు వివరించారు.
నాగార్జున సాగర్, హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలవడంతో అక్కడ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందోని మంత్రి హరీశ్రావు అన్నారు. దుబ్బాక, హుజురాబాద్ లో బీజేపీ కేంద్ర మంత్రులు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. బీజేపీని నమ్మడానికి మునుగోడు ప్రజలు అమాయకులు కారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రుల ప్రచారం గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు మునుగోడుకు అమిత్ షా ఎందుకు వచ్చారో చెప్పాలని.. రోజుకో కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ నాయకులు ఎందుకు వస్తున్నారంటూ మంత్రి హరీశ్ నిలదీశారు.