..పక్క చిత్రంలో కేసీఆర్ కటౌట్తో నవ్వుతూ కనిపిస్తున్న మహిళ పేరు వడ్లూరి లక్ష్మి. వ్యవసాయ కూలీ. ఊరు మొగ్దుంపూర్. నిరుపేద కుటుంబం. భర్త జేసీబీ డ్రైవర్. కనీసం ఇల్లు కూడా లేకపోవడంతో కిరాయికి ఉంటున్నరు. వచ్చిన సంపాదనలో సగం కిరాయికి, మిగిలినయి ఇంట్ల ఖర్చులకు సరిపోతయి. గుంట జాగ కొని ఇల్లు కట్టాలన్న వారి కల అలాగే ఉండిపోయింది. కానీ, రాష్ట్ర సర్కారు పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వడం, ఈ రోజు గృహప్రవేశం కావడంతో లక్ష్మి సంబురపడుతున్నది. తనకు ఇల్లు వస్తుందని కలలో కూడా అనుకోలేదని చెబుతూ మురిసిపోతున్నది. ఇలా ఒక్క లక్ష్మీనే కాదు, మొగ్దుంపూర్లో సొంతింట్లోకి వెళ్లిన 40 మంది లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చలువతోనే తమకు ఇండ్లు వచ్చాయని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు.
కొత్తపల్లి/కరీంనగర్ రూరల్, మే16: సొంతిల్లు.. పేద, నిరుపేద మధ్యతరగతి వర్గాల చిరకాల కల. దానిని సాకారం చేసుకునేందుకు జీవితమంతా కష్టపడుతారు. సగం కడుపునకు తినైనా ఉన్నంతలో ఇల్లు ఎల్లదీసుకుంటూ పైసా పైసా కూడపెడుతారు. అయినా నెరవేరక జీవితకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇది నాటి ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితి. కానీ, స్వరాష్ట్రంలో సొంతింటి కల నెరవేరుతున్నది. టీఆర్ఎస్ సర్కారు రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లను దశలవారీగా నిర్మించి ఇస్తున్నది. తాజాగా కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్లో 2.26కోట్లతో 40 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించింది. సోమవారం మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభోత్సవం చేశారు. పండుగ వాతావరణంలో సామూహిక గృహప్రవేశాలు చేయించి, పట్టాలు అందజేశారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేయగా, లబ్ధిదారులు ఆనందంలో మునిగిపోయారు.
నా జీవితంలో ఇదే అతిపెద్ద కానుక
నేను దివ్యాంగురాలిని. ఉండేందుకు ఇల్లు కూడా లేదు. సొంతిల్లు ఉంటే బాగుంటుందని ఎన్నోసార్లు అనుకున్న. కానీ అది కాని పని అని ఆశ చంపుకున్నా. కానీ ఈ రోజు కేసీఆర్ సారు నా జీవితంలో మరిచిపోలేని అతిపెద్ద కానుక ఇచ్చారు. నాకు ఇల్లు వచ్చిందంటే నమ్మలేకపోతున్న. నాకు తెలంగాణ సర్కారు ప్రతి నెలా రూ 3వేల పింఛన్ ఇస్తూ ఆదుకుంటూనే ఇప్పుడు ఇల్లు కూడా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి రుణపడి ఉంటా.
– తాండ్ర వనిత, దివ్యాంగురాలు, మొగ్దుంపూర్
నాకు పెద్ద దిక్కయింది..
నాకు ఏ ఆధారం లేదు. నా భర్త శంకరయ్య చనిపోయిండు. తెలంగాణ సర్కారే నాకు పెద్ద దిక్కయింది. నెలనెలా నాకు రూ.2016 పింఛన్ ఇస్తంది. పని దొరికినప్పుడు కూలీ పనికి పోతున్న. అచ్చిన పైసలు, సర్కారు ఇచ్చే పింఛనుతో రంది లేకుంట బతుకుతున్న. గూడు లేనోళ్లకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తున్నరంటే దరఖాస్తు చేసిన. ఎవలితో పనిలేకుంట. ఎటూ తిరుగకుంటనే పనైంది. నాకు ఇల్లు అచ్చింది. ఇయ్యాళనే మంత్రి గంగుల కమలాకర్ పట్టా ఇచ్చిండు. చాలా సంబురమైతంది.
– అనిశెట్టి అంజమ్మ, మొగ్దుంపూర్
‘డబుల్’ ఇండ్ల ఘనత టీఆర్ఎస్దే: మంత్రి గంగుల
“దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 74 ఏండ్లలో పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్న ఆలోచన ఏ ప్రభుత్వానికి రాలేదు. ఏ ముఖ్యమంత్రి.. ప్రధాన మంత్రి ముందుకురాలేదు. కానీ సకల సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఘనత దేశంలో ఒక్క టీఆర్ఎస్ సర్కారుదే. సీఎం కేసీఆర్ పాలనలో అందరికీ మేలు జరుగుతున్నది’ అని మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. సోమవారం కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్లో నిర్మించిన 40 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించి, మాట్లాడారు. కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి కమాన్పూర్లో ఇటీవలే డబుల్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేశామని, ఈ రోజు మొగ్దుంపూర్లో అందజేయడం సంతోషంగా ఉందన్నారు. మొగ్దుంపూర్లో 52 మందికి గాను 40 మందికి పట్టాలను పంపిణీ చేశామని, మిగిలిన 12 మందికి త్వరలోనే అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, ఎంపీపీ తిప్తర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీ, ఎంపీటీసీలు దేవనపల్లి పుష్ప, అంజిరెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ ఆనందరావు, శ్రీనివాస్, సంపత్, జక్కన్న, నర్సయ్య, తహసీల్దార్ వెంకట్రెడ్డి, బండ తిరుపతి పాల్గొన్నారు.
భరోసా దొరికింది..
గతంల ఎన్నో ప్రభుత్వాలను చూసినం గానీ పేదలకోసం పనిచేసే ఇసోంటి సర్కారును చూడలే. అందరినీ ఆదుకుంటంది. గూడు లేనోళ్లకు అన్ని సౌలతులతో ఇల్లు నిర్మించి ఇస్తంది. రూపాయి ఖర్చులేదు. ఎటూ తిరుగుడు కూడా లేదు. ఎసోంటి పైరవీలు లేకుంట ఇల్లు ఇచ్చింది. ఇల్లు అనేది చానా రోజుల కల. ఇయ్యాల తీరిపోయింది. నా కుటుంబానికి ఇంత ఇంత భరోసా దొరికింది.
– మూగల నాగమణి, మొగ్దుంపూర్