హనుమకొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును అంతా కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని పట్టుదలతో చేస్తున్నారని వెల్లడించారు. మొదటి దశ కార్యక్రమం సక్సెస్ అయిందని చెప్పారు. పెన్షన్లకు వచ్చిన ప్రతిస్పంద కంటే దీనికి అధికంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన వరంగల్, హనుమకొండ జిల్లాల సన్నద్ధత సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయం చేసుకుని ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
క్యాంపులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ముందుగా కల్పించాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం క్యాంపులు జరిగే ప్రాంతానికి ముందుగానే వెళ్లి పర్యవేక్షించాలని సూచించారు. గ్రామాల్లో కంటివెలుగును విజయవంతం చేయాల్సిన బాధ్యత సర్పంచ్, కార్యదర్శిదేనని స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.