అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంపై అన్నివర్గాల నుంచి విమర్శలు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
తమ నేతలకు సంస్కారం నేర్పాలని బీజేపీ పెద్దలకు చురకలు
రాజకీయంగా టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ను ఎదుర్కోలేక..
ఇలాంటి చిల్లర మల్లర చేష్టలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలపై విమర్శలు
మెదక్, డిసెంబర్ 25 : సభ్యతా, సంస్కారం మరిచి కొందరు బీజేపీ నేతలు చేస్తున్న దూషణలు రాజకీయాలపై ఏవగింపును తెస్తున్నాయి. రాజకీయాలంటే సగటు మనిషికి అయిష్టత కలిగించేలా, వెగటు పుట్టేలా చేస్తున్నాయి. ప్రధానంగా తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) ఇటీవల మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి.పిల్లాడి బాడీషేమింగ్పై మల్లన్న చేసిన వ్యాఖ్యలను అన్నివర్గాలు ఖండిస్తున్నాయి. రాజకీయ విలువలను దిగజారుస్తూ, టీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యులపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ అధిష్టానాన్ని టీఆర్ఎస్ నేతలతో పాటు రైతులు, మహిళలు, ఇతర పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయాలు హుందాగా చేయాలని.. సిద్ధాంతాలు, అంశాల పరంగా విమర్శలు చేసుకోవాలి. కానీ, వ్యక్తిగత దూషణలు, కుటుంబాల జోలికి రావడం తగదని హితవు పలుకుతున్నారు.
దిగజారుడు రాజకీయాలు చేస్తున్న బీజేపీ నాయకులపై ప్రజలు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. బీజేపీ నాయకులు సంస్కారం, సభ్యత లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ దిగజారిపోతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ విలువలను దిగజారుస్తూ, టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల పిల్లలను ఇబ్బందులకు గురిచేసేలా బీజేపీ నాయకుడు తీన్మార్ మల్లన్న(చింతపల్లి నవీన్) తన యూ ట్యూబ్ ఛానల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై చేసిన అసభ్యకర వ్యాఖలను అన్నివర్గాలు ఖండిస్తున్నాయి. ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై ప్రజలు మండిపడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేకనే తీన్మార్ మల్లన్న కేసీఆర్ కుటుంబంపై లేనిపోని రాతలు రాస్తున్నాడని, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇదేనా బీజేపీ పెద్దలు తెలంగాణ నాయకులకు నేర్పుతున్న పాఠాలని టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వెళ్లగక్కారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకనే బీజేపీ నాయకులు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కుటుంబంలోని పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. బాడీ షేమింగ్, వ్యక్తిగత దూషణలు చేస్తూ తమ దిగజారుడు తనాన్ని నిరూపించుకుంటున్నారు. దీనిపై అన్నివర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలు హుం దాగా చేయాలని, సిద్ధాంతాలు, అంశాల పరంగా విమర్శలు చేసుకోవాలి. కానీ, వ్యక్తిగత దూషణలు, నేతల కుటుంబాల జోలికి రావడం తగదని అన్నివర్గాల ప్రజలు పేర్కొంటున్నారు. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్పై వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని అన్నివర్గాల నుంచి డిమాం డ్లు వస్తున్నాయి. శనివారం సంగారెడ్డి జిల్లా జోగిపేట, సిర్గాపూర్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదేనా బీజేపీ నేతల సంస్కారం..
బీజేపీ అగ్రనేతలు వారి నాయకులకు నేర్పే సంస్కృతి ఇదేనా. సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక వారి కుటుంబ సభ్యుల జోలికి రావడం ఎంత వరకు సమంజసం. బాడీషేవింగ్ గురించి కామెంట్ చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలి. సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారో బీజేపీ అగ్రనాయకులు ఆలోచించుకోవాలి. -రావూఫ్, టీఆర్ఎస్ పట్టణ మైనార్టీ
అధ్యక్షుడు, నర్సాపూర్ (మెదక్ జిల్లా)
జర్నలిస్టు ముసుగులో ఆరాచకం..
బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న ఇంకా జర్నలిస్టు పేరును వాడుకోవడం సిగ్గుచేటు. ఇంతకాలం జర్నలిస్టు ముసుగులో ఆయన చేసిన అరాచకాలు, మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప చిల్లరమల్లర పనులు చేయడం తగదు. -దామెర మల్లేశం, మద్దూరు (సిద్దిపేట జిల్లా)
మొదట సంస్కారం నేర్చుకో..
తీన్మార్ మల్లన్న.. సిగ్గుచేటు వ్యాఖ్యలు మాను కో. హిమాన్షు చిన్నపిల్లా డు. ఆయనపై విమర్శలు చేయడం సిగ్గుగాలేదు. నీ కొడుకుతో సమానం గల వ్యక్తిని పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడతావా. బయటకు రా తేల్చుకుందాం. నీ మాటలు విని సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటున్నది. అలాంటి మాటలు మాట్లాడడం తగదు. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. లేకుంటే నీకు గుణపాఠం తప్పదు.
-లక్ష్మణ్ యాదవ్, రామాయంపేట (మెదక్ జిల్లా)
దొంగలకు కొమ్ముకాస్తున్న బీజేపీ
తీన్మార్ మల్లన్న లాం టి దొంగలు, అవినీతిపరులకు బీజేపీ కొమ్ముకాస్తున్నది. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను విమర్శించే స్థాయి తీన్మార్ మల్లన్నకు లేదు. ఇంతకాలం జర్నలిస్టు పేరుతో మాయమాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టిన తీన్మార్ మల్లన్న బాగోతం బీజేపీలోకి పోయినప్పుడే బయటపడ్డది. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోకి అనేక కంపెనీలను తీసుకొస్తున్న మంత్రి కేటీఆర్పై చిల్లరమల్లర మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు.
-వజ్రోజు శంకరాచారి, కమలాయపల్లి, చేర్యాల (సిద్దిపేట జిల్లా)
బీజేపీది కక్షసాధింపు చర్య..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది. దీనిని బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నది. దీంతో అన్ని విషయాల్లో అడ్డుతగులుతూ ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నది. బీజేపీ నేతలు పద్ధతి మార్చుకోకపోతే ప్రజల చేతిలో పరాభావం తప్పదు.
-మల్లికార్జున్ గుప్తా, ఏఎంసీ చైర్మన్ జోగిపేట (సంగారెడ్డి జిల్లా)
ఓర్వలేకపోతున్నారు..
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వానికి నచ్చడం లేదు. అందుకే రైతులు, ప్రజలను ఇబ్బందుల పాల్జేసి, పైసాచిక ఆనం దం పొందుతున్నది. కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపుతున్నది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనేందుకు ముం దుకు రాకపోవడం సిగ్గుచేటు.
-సుభాష్గౌడ్, టీఆర్ఎస్ యూత్ నాయకుడు, గొర్రెకల్(సంగారెడ్డి జిల్లా)
ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి
చిన్న పిల్లాడిని అవమానించేలా వ్యా ఖ్యలు చేయడం తగదు. బీజేపోళ్ల సంస్కారం ఏమిటో తెలుస్తున్నది. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. టీఆర్ఎస్ వాళ్ల జోలికి వస్తే సహించం. తీన్మార్ మల్లన్న ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.
-మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ నేత, ఆర్.వెంకటాపూర్, రామాయంపేట (మెదక్ జిల్లా)
నాశనమైతరు ..
బీజేపోళ్లు బాగానే రాజకీయం జేస్తుండ్రు. బియ్యమేమో కొనమంటుండ్రు. రైతులను గా మోడీ సర్కారు బాగా తకిలీబ్ పెడుతున్నది. గిప్పుడేమో గా బీజేపోళ్లు టీఆర్ఎస్ లీడర్ల పిల్లల్ని తిడుతుండ్రు. గిదేనా రాజకీయం. రాజకీయమంటే సక్కగ పనులు జేయాలే. గాబీజేపోళ్లు లేనిలేని నాటకాలు ఆడుతుండ్రు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న బీజేపోళ్లు నాశనమైతరు.
-బొమ్మల సత్తయ్య, రైతు, చాట్లపల్లి (సిద్దిపేట జిల్లా)
ఉప్పల్ ఏసీపీకి జోగిపేట నాయకుల ఫిర్యాదు
అందోల్, డిసెంబర్ 25: సీఎం కేసీఆర్, వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తున్న తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా జోగిపేట టీఆర్ఎస్ నేతలు లయాక్, ఖాజాపాషా, పలువురు మైనార్టీ నేతలు శనివారం ఉప్పల్ ఏసీపీ శ్యాంప్రసాద్ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకారణంగా నోరుపారేసుకుంటున్న తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్)పై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో నాయకులు షాకీర్, హమీద్, హర్షద్ తదితరులు ఉన్నారు.
సిర్గాపూర్ పీఎస్లో…
సిర్గాపూర్, డిసెంబర్ 25: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కుమార్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శేరికార్ అరుణ్రాజ్ శనివారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో దూషిస్తున్న తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంజీవరావు, సంగం సర్పంచ్ రవీందర్ ఉన్నారు.