సంగారెడ్డి : జిల్లాలోని కంది మండలం మామిడిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి రూరల్ ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. మామిడిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న పొలిమేర సాయిలు (45) సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. సాయిలు శుక్రవారం రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి చితకబాదారు. అనంతరం గొంతు నులిమి చంపారు. మృతుడికి భార్య శోభ, కూతురు దివ్య, కొడుకు పవన్కుమార్ ఉన్నారు. సంఘటనా స్థలాన్ని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ, సీఐ శివలింగం పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, హత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.