కోల్కతా : నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అందరి దృష్టి పశ్చిమ బెంగాల్పై నెలకొంది. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో 292 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరిగాయి. ముర్షిదాబాద్ జిల్లాలోని షంషేర్గంజ్, జంగిపూర్ స్థానాల్లో అభ్యర్థులు మృతి చెందడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఓట్ల లెక్కింపు కోసం 108 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య పోటీ నువ్వానేనా అన్నవిధంగా ఎన్నికలు జరిగాయి. టీఎంసీ తరఫున మమతా బెనర్జీ అన్నీ తానై ప్రచారం నిర్వహించగా.. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ చీఫ్ జేపీనడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు ప్రచారం చేపట్టారు. ఇరు పార్టీలు ప్రచారం హోరాహోరీగా నిర్వహించగా.. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ముఖ్యంగా నందిగ్రామ్ ఫలితంపై ఉత్కంఠ నెలకొన్నది. ఇక్కడ టీఎంసీ తరఫున సీఎం మమత బెనర్జీ బరిలోకి దిగగా.. బీజేపీ నుంచి సువేందు అధికారి పోటీ చేశారు. గతంలో టీఎంసీ తరఫున పోటీ చేసిన సువేందు అధికారి.. ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీంతో మమత ఏళ్లుగా పోటీ చేస్తూ వస్తున్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కాదని నందిగ్రామ్ నుంచి సువేందు అధికారిపై పోటీకి దిగడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నికల్లో మమత తన విజయం ఖాయమని తెలుపుతుండగా.. దీదీని ఓడిస్తానని సువేందు అధికారి శపథం చేశారు.
అయితే, తృణమూల్ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. ఎకనమిక్ సెజ్లకు వ్యతిరేకంగా పోరాడిన రైతులకు అండగా నిలిచింది తృణమూల్ కాంగ్రెస్. అదే 2011లో టీఎంసీని అధికారంలో తీసుకువచ్చింది. మమత అనుచరుడిగా ఇక్కడి రైతాంగ పోరాటాన్ని నాయకుడిగా నడిపించింది సువేంధు అధికారే. దీదీతో కలిసి సువేందు అధికారి కలిసి చేసిన పోరాటం అక్కడ ఆయన్ను తిరుగులేని నేతగా తయారు చేసింది. 2009లో ఉప ఎన్నికలో గెలిచినప్పటి నుంచి సువేందు అక్కడ ఓడిపోలేదు. తర్వాత ఎన్నికల్లోనూ ఆయన మెజారిటీ పెరుగుతూనే వచ్చింది. ఈ పోరాటం తర్వాతే సువేందు అధికారి మమత బెనర్జీకి దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే సువేందు ప్రస్తుతం బీజేపీలో చేరారు. ఎన్నికల్లో మమత బెనర్జీని చిత్తుగా ఓడిస్తామని ప్రకటించారు.
ఇన్నాళ్లు తన వెంటే ఉండి.. ప్రతిపక్ష పార్టీలో చేరిన సువేందు ప్రకటనలను ఆమె సీరియస్గా తీసుకున్నారు. పార్టీలు మారిన అందరికీ గుణపాఠం చెప్పాలని భావించి.. నందిగ్రామ్ నుంచి పోటీ చేయాలని భావించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మమతపై 50వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని, లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సువేందు అధికారి సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇద్దరు నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విమర్శలు.. ఆరోపణలు గుప్పించారు.ఈ క్రమంలో కౌంటింగ్ ప్రారంభం కావడంతో సర్వత్రా అందరి దృష్టి నందిగ్రామ్పై నెలకొంది. ఇద్దరిలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.