లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమవడంతో రాజకీయ పార్టీలు ప్రచార పర్వాన్ని హోరెత్తించాయి. సమాజ్వాదీ పార్టీకి మద్దతుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రచారం చేపట్టారు. బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మవద్దని ఎస్పీకే ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని ఆమె మంగళవారం లక్నోలో ఓటర్లకు పిలుపు ఇచ్చారు. కాషాయ పార్టీ కపట వాగ్ధానాలను నమ్మవద్దని, ఎస్పీకి ఓటు వేసి అధికారం అప్పగించాలని, బీజేపీని మట్టికరిపించాలని ఆమె కోరారు. ఇక అంతకుముందు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) గెలుపొందాలని కోరుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆకాంక్షించారు. కోల్కతాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు ఆదరిస్తే ఈ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ విజయం సాధించే అవకాశం మెండుగా ఉందన్నారు.
బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ తొలి నుంచి అఖిలేష్కు మద్దతుగా ఉన్నారు. దీంతో యూపీలో ఎన్నికల బరిలో టీఎంసీని నిలుపలేదు. అయితే తొలిసారి గోవా అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టిసారించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీరుపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. కోల్కతాలో రెండో ఎయిర్పోర్ట్ కోసం వెయ్యి ఎకరాలు కోరుతున్నారని విమర్శించారు. దీని కోసం అక్కడున్న ఇండ్లను కూల్చాలా అని ఆమె ప్రశ్నించారు. ఆ విధంగా ప్రజలను ఖాళీ చేయించలేమని అన్నారు. పౌర విమానయాన మంత్రి ఈ అంశాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. రైతులను చంపిన వారి (బీజేపీ) మాదిరిగా తాను వ్యవహరించలేనని ఆమె అన్నారు.
ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి ఏడు వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో మరోసారి గెలుపొంది పాలనా పగ్గాలు చేపట్టాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, యోగి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ చెమటోడుస్తోంది. ఇక ప్రియాంక గాంధీ ఇమేజ్తో సత్తా చాటాలని కాంగ్రెస్ పావులు కదుపుతుండగా , దళితులు..అణగారిన వర్గాల వెన్నుదన్నుతో సత్తా చాటాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కసరత్తు సాగిస్తోంది.