నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్లో ఏకంగా రెండు ఇళ్లు కిరాయికి తీసుకున్నారు. నందిగ్రామ్లోని రేయపారాలో ఈ రెండు ఇళ్లు ఉన్నాయి. మమత బయటి నుంచి వచ్చిన వ్యక్తి అంటూ ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి పదే పదే ఆరోపణలు చేస్తుండటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అంతేకాదు త్వరలోనే తాను నందిగ్రామ్ శాశ్వత నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటానని ఆదివారం ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రకటించారు. మమత నందిగ్రామ్కు చెందిన వ్యక్తి కాదంటూ నామినేషన్ వేసిన వెంటనే సువేందు ఆరోపించారు.
అయితే మమత మాత్రం ఏడాది కిందటే ఈ ఏరియాలో ఓ ఇంటిని కిరాయికి తీసుకున్నారు. మరో ఇంటిని ఆర్నెళ్ల కిందట తీసుకోగా.. ఈ రెండు ఇళ్లకు మధ్య దూరం కేవలం 100 మీటర్లే. తాను నందిగ్రామ్ నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పటి నుంచీ టీఎంసీ నేతలు ఆమె కోసం అక్కడ ఇళ్ల వేట మొదలుపెట్టి.. చివరికి ఈ రెండు ఇళ్లను ఫైనల్ చేశారు. నిజానికి మొదట తాను తీసుకున్న ఇంట్లో మమతా ఉందామని భావించినా.. అక్కడ గదులు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. కాలి గాయం కారణంగా ఇప్పుడు అక్కడికి వెళ్లడం సాధ్యం కాకపోవడంతో రెండో ఇంట్లో ఉండాలని ఆమె నిర్ణయించారు. ఇప్పటికే ఆ ఇంటి దగ్గర భద్రతను పెంచారు. ముఖ్యమంత్రి తమ ఇంటిని కిరాయికి తీసుకోవడంతో ఆ ఇంటి యజమాని అయిన ఓ రిటైర్డ్ హైస్కూల్ టీచర్ సుదమ్ చంద్ర పారుయ్ తెగ ఆనందపడిపోతున్నారు.