ముంబై: ప్రధాని మోదీ ఇంటి పేరుపై రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవల సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష విధించడం, జైలుశిక్ష కారణంగా లోక్సభ సెక్రెటేరియట్ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చినా.. వీర్ సావర్కర్పై రాహుల్ వ్యాఖ్యలు బెడిసికొట్టాయి. చిన్న కేసులో రెండేళ్ల జైలుశిక్ష వేయడం, ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న 14 విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తుండగా కొత్తగా తృణమూల్ కాంగ్రెస్ కూడా జతకలిశాయి.
ఈ విధంగా రాహుల్గాంధీ ఎంపీ పదవి పోవడం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింటే అయ్యింది. కానీ, తాజాగా వీర్ సావర్కర్పై రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలు బెడిసికొట్టాయి. రాహుల్గాంధీకి జైలుశిక్ష పడటంతో దేశంలో దొంగలు, దోపిడీదార్లకు స్వేచ్ఛ, రాహుల్గాంధీకి శిక్షనా..? అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే కేంద్ర సర్కారును ఉద్దేశించి ప్రశ్నించారు. కానీ, వీర్ సావర్కర్పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఉద్ధవ్ శివసేన పార్టీకి ఆగ్రహం తెప్పించాయి.
‘నేను సావర్కర్ను కాదు, గాంధీని. గాంధీలు ఎప్పుడూ క్షమాపణలు చెప్పరు’ అని ఇటీవల రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. లండన్లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో దేశాన్ని కించపర్చే ప్రసంగం చేసినందుకు క్షమాపణలు చెప్పాలంటూ అధికార పక్షం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ పై వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు శివసేన మనసు నొప్పించాయి. రాహుల్గాంధీ తాను క్షమాణలు చెప్పేది లేదు అనడానికి వీర్ సావర్కర్ పేరును ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఉద్ధవ్ థాకరే సీరియస్ అయ్యారు.
‘నేను రాహుల్గాంధీకి ఒక విషయం చెప్పదలుచుకున్నా. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కలిసి పోరాడుదాం అనుకున్నాం. కాబట్టి ఐక్యతను చెడగొట్టే వ్యాఖ్యలు ఇకనైనా మానుకోండి. వీర్ సావర్కర్ మాకు దేవుడు. మా మార్గదర్శి. ఆయనకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తే మేం సహించం’ అని ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. సావర్కర్పై రాహుల్గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించిన డిన్నర్ మీట్కు కూడా తాను హాజరుకావడం లేదని ఆయన ప్రకటించారు.