నాగర్కర్నూల్, ఏప్రిల్ 16 : తెలంగాణలో మూడు ఎస్సీ పార్లమెంట్ స్థానాల్లో మాదిగలకు కాంగ్రెస్ ఒక్క ఎంపీ స్థానం కూడా ఇవ్వకుండా మోసం చేసిందని నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. మంగళవారం నాగర్కర్నూల్లోని సాయి గార్డెన్స్లో మాదిగల రాజకీయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్, బాబు జగ్జీవన్రామ్ జయంతి ఉత్సవాలను నిర్వహించగా ఆర్ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై వారి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మాదిగలెవరూ కాంగ్రెస్కు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. మహనీయులను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్పీని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు. అనంతరం పట్టణంలో బీఆర్ఎస్ ప్రచార రథాన్ని ఆర్ఎస్పీ, గువ్వల ప్రారంభించారు. కార్యక్రమంలో నాయ కులు ప్రదీప్, విజయ్, లక్ష్మయ్య, రజని పాల్గొన్నారు.