న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలు ఇవాళ ఉదయం వాయిదా పడ్డాయి. విపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో లోక్సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అరెస్టుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సభను సజావుగా సాగనివ్వాలని స్పీకర్ ఓం బిర్లా కోరినా.. విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో ఆయన సభను వాయిదా వేశారు. ధరల పెరుగుదలపై ఇవాళ సభలో చర్చ చేపట్టాల్సి ఉందని, కానీ విపక్షాలు నిరసన చేపడుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు. ధరల పెరుగుదల అంశంపై విపక్షాలు చర్చను అడ్డుకుంటుఉన్నట్లు మంత్రి అర్జున్ చెప్పారు. రాజ్యసభలోనూ ఇదే సీన్ జరిగింది. విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టడంతో చైర్మెన్ వెంకయ్య నాయుడు సబను 12 గంటల వరకు వాయిదా వేశారు.