సుబేదారి, మార్చి 28 : పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ తుపాకులు తీసుకున్నవారు వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లో అందజేయాలని సీపీ అంబర్ కిశోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయుధాల చట్టాన్ని అనుసరించి ప్రభుత్వ అనుమతితో తుపాకులు తీసుకున్నవారు అప్పగించాలని సూచించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 201మందికి తుపాకులు ఇచ్చారని, వీరిలో హనుమకొండ జిల్లాలో 131మంది, వరంగల్ జిల్లా 52మంది, జనగామ జిల్లాలో 18మంది ఉన్నారన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తిరిగి అందజేస్తామని సీపీ పేర్కొన్నారు. జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే భద్రతా సిబ్బంది, గార్డు డ్యూటీలో ఉన్నవారికి మినహాయింపు ఉంటుందన్నారు.