సెర్ప్ సహకారంతో ముందడుగు
పర్యావరణం, ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగం
స్వయం ఉపాధిలో రాణిస్తున్న జాన్సీలింగాపూర్ మహిళలు
రామాయంపేట రూరల్, డిసెంబర్ 27: నేటి మహిళలు అన్నిరంగాల్లో సత్తా చాటుతున్నారు. ఉద్యోగం, వ్యాపారంలో రాణిస్తూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారంలో మెళకువలు నేర్చుకుని సమయానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని విజయతీరాలకు చేరుతున్నారు. తక్కువ ఆదాయం వచ్చే మార్గాలను వీడి ఎక్కువ ఆదాయం వచ్చే వాటిపై దృష్టిసారిస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం జాన్సీలింగాపూర్కు చెందిన నలుగురు మహిళలు సంఘంగా ఏర్పడి పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా రుణం తీసుకున్నారు. రూ.1.20 లక్షలతో విస్త్తర్లు తయారుచేసే మిషన్ను కొనుగోలు చేశారు. ఈ మిషన్తో ప్రతిరోజూ సుమారు 500 వరకు విస్తర్లు తయారు చేస్తున్నారు. వీటి తయారీ కోసం గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లి మోదుగు ఆకు తీసుకువచ్చి వాటిని కుట్టి, వాటి కింద అట్ట ముక్కను అతికించి మిషన్ సహాయంతో విస్తర్లుగా తయారు చేస్తున్నారు. అనంతరం మెదక్, కామారెడ్డి, దౌల్తాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏదైనా శుభకార్యాలకు అవసరం ఉన్న వారు నేరుగా తమ దుకాణం వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. వీటిని ఒక్కొక్కటి రూ.5 చొప్పున మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆదాయం ముఖ్యం కాదని, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, సంప్రదాయాన్ని కాపాడటం ముఖ్య ఉద్దేశమన్నారు. తీసుకున్న రుణం నెలకు రూ.5 వేల చొప్పున చెల్లిస్తున్నామని, ఒక్కో విస్త్తరు తయారీకి రూ.3 వరకు ఖర్చవుతున్నట్లు పేర్కొన్నారు.
పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి…
అటవీ ప్రాంతంలో నుంచి మోదుగు ఆకు సేకరించి విస్తర్లు కుట్టడం చూస్తుంటే చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. వీటిని సహజసిద్ధంగా తయారు చేస్తున్నాం. వీటి వినియోగంతో పర్యావరణంతో పాటు ఆరోగ్యానికి అనేక లాభాలు ఉన్నాయి. ప్లాస్టిక్ వాడకం కొంత అరికట్టవచ్చు. లాభాల గురించి చూడకుండా ఆరోగ్యం, ఆచార సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని వీటిని తయారు చేస్తున్నాం.
– ఏసుమణి, సెంటర్ నిర్వాహకురాలు
స్వయం ఉపాధి ఎంతో మేలు…
స్వయం ఉపాధి ద్వారా చిన్నపాటి వ్యాపారం చేసినా ఎంతో ఆనందంగా ఉంది. విస్తర్ల తయారీ మొదట్లో ఇబ్బందికరంగా ఉన్నా తరువాత ఎంతో సులభమైంది. రుణాలు తీసుకోవడమే కాకుండా వాటిని తీర్చడానికి ఇలాంటి చిన్నపాటి వ్యాపారాలు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. దీంతో ఇంట్లో వారికి, రుణం ఇచ్చిన వారికి ఆనందంగా ఉంటుంది. -దయామణి, గ్రూపు సభ్యురాలు