అడుగు దూరంలో ఎంత తేడా..! ఒక అడుగు ఇటు వేస్తే పచ్చని పంటలు, 24 గంటల కరెంటు, మండు వేసవిలోనూ పొలాల్లో పారుతున్న నీళ్లు.. అదే అడుగు అటు వేస్తే ఎండిన పొలాలు, వట్టిపోయిన మోటర్లు, ఎప్పుడొస్తదో తెలువని కరెంటు.. తెలంగాణ సరిహద్దుల్లో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలివి. మన సరిహద్దు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని పల్లెల్లో విద్యుత్తు కోతలతో వ్యవసాయం ఒట్టిపోతే, నిరంతర విద్యుత్తుతో తెలంగాణ పల్లెల్లో పచ్చని పైరు సంబురం కనిపిస్తున్నది. దీంతో పొరుగు రాష్ర్టాల రైతులు తెలంగాణలో భూములు కొని పంటలు సాగుచేస్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు తమకూ కావాలని వారి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 8: 24 గంటల ఉచిత విద్యుత్తుతో తెలంగాణలో వ్యవసాయరంగం స్వరూపమే మారిపోయింది. పంటల దిగుబడి అమాంతం పెరిగింది. దేశమంతా విద్యుత్తు సంక్షోభంలో ఉన్నా, నేడు తెలంగాణ రైతులు ఏ చీకూ చింతా లేకుండా పొలాల్లో పనిచేసుకొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కష్టాలను తలుచుకొంటే ఇప్పటికీ కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని రైతులు అంటున్నారు. నాడు సాగుకు కేవలం ఆరు గంటలు కరెంటు ఇచ్చేవారు. అది కూడా పగలు 3 గంటలు, రాత్రి 3 గంటలు. లో ఓల్టేజీ కరెంటుతో ట్రాన్స్ఫార్మర్లు తరుచూ కాలిపోయేవి. రాత్రిపూట పొలాల వద్ద నీళ్లు పారించేందుకు వెళ్లే రైతులు మృత్యువాత పడేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018లో ప్రారంభమైన 24 గంటల ఉచిత విద్యుత్తు తమ కష్టాలన్నీ తీర్చిందని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
తెలంగాణలో భూములు కొని..
24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలతో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని పండుగలా మార్చటంతో పక్క రాష్ర్టాల రైతులు మన రాష్ట్రంపై దృష్టిపెట్టారు. సరిహద్దు పల్లెల్లో ఎకరా, రెండెకరాల భూమి కొని బోర్లు వేసి తెలంగాణ ప్రభుత్వ పథకాలను వాడుకొంటున్నారు. బోర్లు, బావుల్ల్లో నీళ్లు పుష్కలంగా ఉంటే తమ సొంత రాష్ర్టాల్లోని పొలాలకు పైపుల ద్వారా సరఫరా చేసుకొని పంటలు పండిస్తున్నారు. తెలంగాణలో భూములు కొనలేనివారు మన రైతులతో నీటి ఒప్పందాలు చేసుకొని, సరిహద్దు అవతలికి తరలించి పంటలు పండిస్తున్నారు.
తెలంగాణ పథకాలు మాకూ కావాలి
ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలోని మారాయిగూడెం, కుంట ప్రాంతాల్లో రైతులు వానకాలంలోనే పంటలు సాగు చేస్తున్నారు. తలాపునే గోదావరి పారుతున్నా తాగునీరు, సాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలో మాదిరిగా తమకూ రైతుబంధు పథకం అమలు చేయాలని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమకూ 24 గంటల కరెంటు ఇవ్వాలని ఏపీ రైతులు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమకు రోజుకు కేవలం ఏడు గంటలే కరెంటు ఇస్తున్నారని, దీంతో నీళ్లున్నా పంటలు వేయలేకపోతున్నామని గుంటూరు జిల్లా రైతులు వాపోతున్నారు. తెలంగాణకు ఆనుకొని ఉన్న కర్ణాటకలోని బీదర్ జిల్లాలో రైతులు ఎక్కువగా చెరుకు పంటను సాగుచేస్తున్నారు. కరెంటు కోతలతో పంట ఎండిపోతున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇచ్చే కొద్ది గంటల కరెంటు కూడా రాత్రివేళల్లో సరఫరా చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
విలీన మండలాల గోస
తమను ఏపీలో కలుపటంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఏపీలో కేంద్రం బలవంతంగా విలీనం చేసిన ఖమ్మం జిల్లాలోని మండలాల రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా వరరామచంద్రాపురం, కూనవరం, చింతూరు మండలాల్లో కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్నారు. విలీన మండలాల సమీపంలో శబరి, గోదావరి నదులు ప్రవహిస్తున్నా పంటలకు చుక్కనీరు అందడం లేదు. నదుల వద్ద మోటర్లు పెట్టి నీటిని తరలించాలంటే విద్యుత్తు సరఫరా సక్రమంగా లేదని వాపోతున్నారు.
తెలంగాణ నీళ్లతో మహారాష్ట్రలో పంట
పై చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు షేక్ అబ్దుల్ రబ్. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలుకా ఇస్లాంపూర్ సర్కిల్ అప్పారావుపేట వాసి. మహారాష్ట్రలో తనకున్న రెండెకరాల భూమిలో విద్యుత్తు సరఫరా సరిగా లేక పంటలు పండటంలేదు. దీంతో తమ గ్రామానికి సరిహద్దుగా ఉన్న తెలంగాణలోని నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జెవ్లీ గ్రామంలో రెండేండ్ల క్రితం రెండెకరాల భూమి కొని, బోరు వేసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. తెలంగాణ సర్కారు అందిస్తున్న ఉచిత విద్యుత్తుతో వానకాలంలో 30 క్వింటాళ్ల వడ్ల దిగుబడి రాగా, ఖర్చులు పోను రూ.50 వేలు, యాసంగిలో రూ.60 వేల ఆదాయం వచ్చిదని అబ్దుల్ రబ్ తెలిపారు.
తప్పిన రాత్రిళ్ల పడిగాపులు
ఉమ్మడి రాష్ట్రంలో రైతులు వచ్చిరాని కరెంటుతో రాత్రింబవళ్లు బోర్లు, బావుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. అర్ధరాత్రి ఇండ్లు, పిల్లలను వదిలి బావుల వద్ద పడిగాపులు పడేవారు. ఏ గ్రామంలో చూసినా ఇవే పరిస్థితులు ఉండేవి. కొందరు రైతులు రాత్రిపూట పాము, ఇతర కీటకాల కాట్లకు గురై ప్రాణాలు సైతం కోల్పోయేవారు. పండ్ల తోటల రైతులైతే రాత్రిళ్లు సైతం పైపులు పరిచి చెట్లను పారించేందుకు పడరాని పాట్లు పడేవారు. నేడు ఆ పరిస్థితి మచ్చుకు కూడా కనపడటంలేదు.
తెలంగాణే బతికిస్తున్నది
విద్యుత్తు మోటర్ను ఆన్ చేసున్న ఈ రైతు మహారాష్ట్రలోని అప్పారావుపేటకు చెందిన లస్మన్న. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తుతోనే వ్యవసాయం చేసుకొని బతుకుతున్నామంటున్న ఈయనకు స్వగ్రామంలో ఎనిమిదెకరాల భూమి ఉన్నది. విద్యుత్తు కొరతతో పంటలు సరిగా పండక ఏటా నష్టపోయేవారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తును చూసి ఆయన కూడా జెవ్లీలో రెండెకరాల భూమి కొని వ్యవసాయం చేస్తున్నాడు. రెండు సీజన్లలో కలిపి ఖర్చులు పోను రూ.1.30 లక్షల ఆదాయం వస్తున్నదని చెప్పాడు. తెలంగాణలోని భూములే తమ కుటుంబానికి ఉపాధి కల్పిస్తున్నాయని అంటున్నారు.
కరెంటు కోత.. బిల్లుల మోత
ఏపీలో రోజుకు 9 గంటలపాటు (ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా చేయాలి. కానీ గత కొద్ది రోజులుగా 7 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 3 గంటల వరకే కరెంటు ఉంటున్నది. కొన్ని సార్లు ఈ 7 గంటల కూడా రెండు విడతలుగా ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు.
మహారాష్ట్రలో 9 గంటలు విద్యుత్తు సరఫరా చేయాల్సి ఉన్నా 8 గంటలే ఇస్తున్నారు. బిల్లులు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఒక్కో హెచ్పీ సామర్థ్యానికి రూ. 22 చొప్పున బిల్లు వేస్తున్నారు. ఇలా నెలకు ఒక్కో వ్యవసాయ కనెక్షన్కు రూ.1,600 వరకు బిల్లులు వస్తున్నాయి.
పశ్చిమబెంగాల్లో వ్యవసాయ విద్యుత్తుకు భారీగా బిల్లులు వసూలు చేస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా నెలకు ఒక్కో కనెక్షన్కు రూ. 4,500లకు పైగా బిల్లు వేస్తున్నారు.
డబుల్ ఇంజిన్ రాష్ట్రమని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకొనే ఉత్తరప్రదేశ్లో వ్యవసాయానికి కేవలం 9 గంటలే కరెంటు ఇస్తున్నారు. ఒక్కో కనెక్షన్కు సగటున రూ.2,408 చార్జీ వసూలు చేస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో వ్యవసాయానికి కేవలం 9 గంటలే విద్యుత్తును అందిస్తున్నా, నెలకు అన్ని చార్జీలు కలిపి రూ.667 చొప్పున వసూలు చేస్తుండటం గమనార్హం.
కర్ణాటకలో సాగుకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నా, అది కేవలం 7 గంటలే.. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఆ 7 గంటలు కూడా అరకొరగానే వస్తున్నదని రైతులు మండిపడుతున్నారు.
ఒడిశాలో 24 గంటలపాటు విద్యుత్తు అందిస్తున్నా, యూనిట్కు రూ.1.50చొప్పున వసూలు చేస్తున్నారు.
తెలంగాణలో 23 లక్షలకుపైగా (2018 జనవరి ఒకటి నాటికి) వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు అందిస్తున్నారు. గత నాలుగేండ్లలో వ్యవసాయ కనెక్షన్లు 26.41 లక్షలకు పెరిగాయి. ప్రస్తుతం దేశం మొత్తం విద్యుత్తు సంక్షోభంలో చిక్కుకొన్నా, తెలంగాణలో నిరాటంకంగా 24 గంటలపాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందుతున్నది.
ఒక్క మడి కూడా తడుస్తలేదు
మాకు రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు కరెంటు ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు కరెంటు ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. కరెంటు వచ్చినపుడు పొలంలో నీళ్లు వదిలితే ఒక్క మడి తడువకముందే పోతున్నది. రోజూ ఇదే వరుస. ఇక పంటలెట్ల పండించుకోవాలి? మా కష్టం ఎవరికి చెప్పుకోవాలి?
-బెలగాపు రమణ, ఆర్తాం, పార్వతీపురం మన్యం జిల్లా, ఏపీ
ఆరుతడి పంటలు తడపలేక పోతున్నం
ఏపీలో విద్యుత్తు కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. రోజంతా 6 గంటలు మాత్రమే కరెంట్ ఉంటుంది. దీంతో పంటలకు సరిపోను నీరు అందడం లేదు. ఆరుతడి పంటలైన మిర్చి, పత్తి పంటల మీదే ఆధారపడినా.. కరెంట్ సమస్యతో దిగుబడి కష్టంగానే ఉన్నది. తెలంగాణలో 24 గంటలు విద్యుత్తు ఇవ్వడం, పండిన పంటను కూడా ప్రభుత్వమే కొనడం అక్కడి రైతుల అదృష్టం.
-చిలుముల దుర్గారావు, నడికుడి, దాచేపల్లి, పల్నాడు, ఏపీ
కరెంట్ లేదు.. సర్కారు సాయం అందదు
వ్యవసాయానికి 6 గంటలే కరెంటు ఇస్తున్నారు. లోడ్ ఎక్కువై ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు కాలిపోతుందో తెలియటం లేదు. మా పక్కనే ఉన్న తెలంగాణ రైతులకు అక్కడి సర్కారు 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నది. మాకు విత్తనాలు కావాలన్నా తెలంగాణలోని నారాయణపేటకు వెళ్లాల్సిందే. వడ్లు అమ్మాలన్నా పేట మార్కెటే గతి. ప్రభుత్వం మా సమస్యలపై కనీసం స్పందించడం లేదు.
-మహ్మద్ హనీఫ్, పుట్పాక్ గ్రామం, గుర్మిట్కల్ తాలూకా, యాద్గిర్ జిల్లా, కర్ణాటక
యాసంగి పంట చూడలేదు
ఒక పంట సాగు చేయడానికే కరెంటుతో కష్టాలు పడుతున్నాం. రెండో పంటను మేం ఎప్పుడూ వేయలేదు. అప్పుడు ఆంధ్రాలో రెండు పంటలు వేసినట్టు తెలుసు. ఇప్పుడు తెలంగాణలో రెండు పంటలు వేస్తున్నారు. తెలంగాణ రైతులు అదృష్టవంతులు. రైతుబందు వస్తున్నది. రైతుబీమా కూడా ఇస్తున్నరు. మమ్మల్ని ఆంధ్రాలో కలపడం మా దృరదృష్టం.
-ముత్యాల శ్రీరామమూర్తి, రైతు, వడ్డిగూడెం, వీఆర్ పురం మండలం, ఏపీ
8 గంటలు కూడా కరెంటు ఇస్తలేరు
కాంగ్రెస్ సర్కార్ రైతులను నిలువునా ముంచింది. మొక్కజొన్నకు రూ.1,700 కనీస మద్దతు ధర ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించి ఇప్పటికీ అమలుచేయలేదు. మా రాష్ట్రంలో 24 గంటల పాటు పంటలకు ఉచిత విద్యుత్తు ఆశించడం అత్యాశే. రోజుకు కనీసం 8 గంటలు కూడా రావటంలేదు.
-విజయ్, రైతు, కుంట, ఛత్తీస్గఢ్