ఆలేరు, సెప్టెంబర్27 : ఆలేరులో పద్మాశాలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మతో సహా పలువురికి న్యాయవాదిగా సేవలందించి వారి తరఫున న్యాయపోరాటం చేసిన గొప్ప ప్రజాస్వామిక వాది బాపూజీ అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన పోరాటంలో అదే స్ఫూర్తిని కొనసాగించిన కొండాలక్ష్మణ్ బాపూజీ దేశం గర్వించదగ్గ నేత అని పేర్కొన్నారు. అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా నిలిచిన బాపూజీ బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా తన సర్వస్వం దారబోశారని అన్నారు. బాపూజీ సేవలను గుర్తించి ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడం హర్షణీయమని పేర్కొన్నారు.
భువనగిరి కలెక్టరేట్ : లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. యువత లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, తాసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.