KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్కు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొనటం వెనుక భారీ బాగోతాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ముందు రూ. 50వేల కోట్లు అని చెప్పి తరువాత ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని మూడింతలు పెంచటం ద్వారా కాంగ్రెస్ ధనదాహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. తట్టెడు మట్టి తీయకుండా వేల కోట్లు తన్నుకుపోయే కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కుంభకోణాల కాంగ్రెస్ ఆటలు సాగనివ్వమని తేల్చిచెప్పారు.
మూసీ సుందరీకరణ పేరుతో రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎంత మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగులోకి వచ్చే ఎకరాలెన్ని? నిల్వ ఉంచే టీఎంసీలెన్ని ? పెరిగే పంటల దిగుబడి ఎంత? తీర్చే పారిశ్రామిక అవసరాలెంత? కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లు ఎన్ని అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 80 వేల కోట్లయితేనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. లండన్లోని థేమ్స్లాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏంటి ? గేమ్ ప్లాన్ ఏంటీ? అని కేటీఆర్ నిలదీశారు.
ముఖ్యమంత్రికి కనీసం తను పుట్టిన గడ్డ మీద కూడా మమకారంలేదని కేటీఆర్ ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకన్నా మూసీ ప్రాజెక్టుపైనే ముఖ్యమంత్రి ఎందుకు ఎకువ మకువ చూపుతున్నారని ప్రశ్నించారు. చివరి దశలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజీలోకి నెట్టి మూసీ చుట్టే తిరగటం వెనుక దాగిన ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. వేల కోట్లను దోచుకునేందుకే మూసీ పేరుతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరిట బ్యాక్ డోర్లో జరుగుతున్న బాగోతాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని చెప్పారు.