KTR | మేడ్చల్ మల్కాజ్గిరి : బీజేపీని అడ్డుకునే దమ్ము ఒక్క బీఆర్ఎస్కే ఉందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా బీజేపీని అడ్డుకున్నది బీఆర్ఎస్ మాత్రమే అని స్పష్టం చేశారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా కేటీఆర్ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు.
ఈటల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్ రావు, అర్వింద్, సోయం బాపురావును ఓడించిందెవరు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ లీడర్లు అందరిని ఓడించింది బీఆర్ఎస్ మాత్రమే. బీజేపీని ఓడించే దమ్ము లేని కాంగ్రెస్కు ఓటు వేసి వృథా చేయొద్దు. కొందరు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి అని ప్రచారం చేస్తున్నారు. నిజంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైతే కేసీఆర్ కూతురు జైల్లో ఉండేదా? తప్పుడు ప్రచారాలను మైనార్టీలు నమ్మవద్దు. బీజేపీని ఓడించే దమ్ము లేకనే రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీ చేస్తున్నాడు. మరోసారి కాంగ్రెస్కు ఓటు వేస్తే మొత్తం పథకాలను రేవంత్ రెడ్డి బంద్ పెడతడు. ఏమీ చేయకపోయినా సరే ఓట్లు వేశారంటూ అన్ని పథకాలను ఆపేస్తడు. కాంగ్రెస్ చెప్పిన అన్ని పథకాలు అమలు కావాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలె అని కేటీఆర్ చెప్పారు.
గత పదేళ్లలో హైదరాబాద్కు, తెలంగాణకు బీజేపీ ఏం చేసింది లేదు. ఉప్పల్, అంబర్పేట్లో పదేళ్లలో రెండు ఫ్లై ఓవర్లు కూడా కట్టలేకపోతున్నారు. మేము 36 ఫ్లై ఓవర్లు కడితే రెండు కూడా కట్ట చేతకాని బీజేపీకి ఓట్లు అడిగేందుకు సిగ్గు ఉందా? మోడీ వచ్చిన నాడు రూ. 400 సిలిండర్. ఇప్పుడు రూ. 1100. మోడీ వచ్చిన నాడు ముడి చమురు వంద డాలర్లకు బ్యారెల్. ఇప్పుడు ముడి చమురు బ్యారెల్ కు 84 డాలర్లు. మరి తగ్గాల్సిన ధరలు ఎందుకు తగ్గలేదు. రూ. 70 పెట్రోల్ రూ. 110 అయ్యింది. పప్పు, ఉప్పు, చింతపండు, బస్సు, రైలు అన్ని ధరలు పెంచిండు. అందుకే మోడీని ప్రజలందరూ ప్రియమైన ప్రధాని కాదు పిరమైన ప్రధాని అని అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ లేడు రాష్ట్రం ఆగమైందని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ నిన్న మొత్తం అనుమానాలకు సమాధానాలను వివరంగా చెప్పిండు. రేవంత్ బక్వాస్ ప్రచారాలను తిప్పి కొట్టిండు. మీరు 10 స్థానాలు ఇస్తే మళ్లీ రాష్ట్రంలో కేసీఆరే రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తది. మోడీ 400 సీట్లు అని బిల్డప్ ఇస్తున్నాడు. వాళ్లు పోటీ చేసేదే 420 సీట్లు. మోడీ గెలవడని అర్థమైంది కనుకనే ముస్లింల మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఎన్డీఏ కూటమికి 200 దాటావు, ఇండియా కూటమి కి కూడా 150 సీట్లు దాటావు. అందుకే బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్లె మనల్ని బతిమిలాడే పరిస్థితి వస్తదని తెలిపారు.
బడే భాయ్ మోడీకి మేలు చేసేందుకు చోటే భాయ్ రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ నుంచి డమ్మీ అభ్యర్థిని పెట్టిండు. రాష్ట్రంలో చాలా చోట్ల మోడీకి మేలు చేసేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టింది. రాహుల్ గాంధీ ఏమో చౌకిదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమో మోడీ హమారా బడే భాయ్ అంటాడు. రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కాం ఏం లేదంటాడు. కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయమని అంటాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కవితమ్మ అరెస్ట్ కరెక్టే అంటాడు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా మోడీ కోసం పనిచేస్తుండా ? అని ప్రశ్నించారు కేటీఆర్.