బోధన్, మే 5: ప్రజల కోసం బుద్దె రాజేశ్వర్ పడిన తపన, ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని,రాజేశ్వర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం సాలూర మండల కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత బుద్దె రాజేశ్వర్ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు బుద్దె రాజేశ్వర్ చిత్రపటానికి పోచారం శ్రీనివాసరెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా తదితరులు పూలువేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో పోచారం మాట్లాడుతూ.. బుద్దె రాజేశ్వర్ అందరినీ కలుపుకునిపోయే వ్యక్తి అని, అన్ని పార్టీలకు నచ్చిన వ్యక్తి అని ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని అన్నారు. తనతో ఎప్పుడు మాట్లాడినా రైతులు, ప్రజల గురించి తప్ప తన వ్యక్తిగత సమస్యలు చెప్పేవారు కాదని పోచారం అన్నారు. అనంతరం బుద్దె రాజేశ్వర్ సేవలను సుదర్శన్రెడ్డి, మండవ కొనియాడారు. సంస్మరణ సభలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఇల్లెపు శంకర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ డైరెక్టర్ గిర్ధావర్ గంగారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గంగాధర్రావు పట్వారీ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. బుద్దె రాజేశ్వర్ స్మారకార్థం సాలూర మండలం కేంద్రంలో సాలూర యూత్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్పల్లి రక్తదాన శిబిరం నిర్వహించగా.. 61 మంది దాతలు రక్తాన్ని దానం చేశారు.