టెల్ అవీవ్, మే 5: ఖతార్ దేశానికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరాపై ఇజ్రాయెల్ ప్రభుత్వం వేటు వేసింది. తమ దేశంలోని అన్ని అల్ జజీరా కార్యాలయాలను మూసివేయాలని క్యాబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆదివారం ఎక్స్లో ప్రకటించారు. అయితే ఇది ఎప్పటి నుంచి అన్న విషయాలను వెల్లడించ లేదు.
ఇజ్రాయెల్ నిర్ణయం అల్ జజీరాతో ఉన్న వైరాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ ఛానల్ ఖతార్కు చెందినది కావడంతో ఆ దేశంతో సైతం ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే గాజాలో యుద్ధ నివారణకు జరిగిన మధ్యవర్తిత్వంలో ఖతార్ కీలక పాత్ర పోషించింది. కాగా, గాజాతో యుద్ధం సమయంలో అల్ జజీరా ఛానెల్ ఇజ్రాయెల్ ఊచకోతను హైలెట్ చేస్తూ ప్రసారం చేస్తుండేది.