హైదరాబాద్ : అర్ధరాత్రి వేళ కదులుతున్న రైలులో ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండానే ఓ గర్భిణీకి పురుడు పోసి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడిన హౌస్ సర్జన్ స్వాతిరెడ్డిని పలువురు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్ప్రె్సలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. స్వాతిరెడ్డి సోమవారం రాత్రి విజయవాడలో దురంతో ఎక్స్ప్రెస్ ఎక్కి విశాఖపట్నం బయల్దేరారు.
ఆమె ఎక్కిన బి6 కంపార్టుమెంట్లోనే శ్రీకాకుళానికి చెందిన సత్యవతి (28), ఆమె భర్త ప్రయాణిస్తున్నారు. సత్యవతి గర్భవతి. డెలివరీకి ఇంకా నాలుగు వారాలు ఉందని పుట్టింటికి వెళుతోంది. తెల్లవారుజామున ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. ఎవరైనా మహిళల సాయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమె భర్త స్వాతిరెడ్డి బెర్త్ వద్దకు వచ్చి ఆమెను నిద్రలేపారు. తన భార్యకు నొప్పులు వస్తున్నాయని, సాయం చేయాలని కోరారు.
స్వాతిరెడ్డి డాక్టర్ కావడంతో తక్షణమే స్పందించి 15 నిమిషాల్లోనే నార్మల్ డెలివరీ చేశారు. అసలు ఆ సమయంలో ఆమె దగ్గర ఒక్క పరికరం కూడా లేదు. బెడ్ షీట్ను అడ్డుగా ఉంచి పురుడు పోశారు. పురుడు పోసి తల్లీబిడ్డలను కాపాడిన స్వాతిరెడ్డికి సత్యవతి దంపతులు ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి పరికరాలు లేకుండానే అర్ధరాత్రి వేళ గర్భిణికి పురుడు పోసి తల్లీ బిడ్డలను కాపాడిన వైద్య విద్యార్ధిని స్వాతి రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు.
My compliments to the medical student 👏 https://t.co/uLtEFP0n08
— KTR (@KTRTRS) September 14, 2022