జగిత్యాల, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో రూ.700 కోట్లతో భారీ ఇథనాల్, రైస్బ్రాన్ ఆయిల్ తయారీ పరిశ్రమను నెలకొల్పనున్నారు. క్రిశాంత్ భారతీ కో ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిభ్కో) భాగస్వామ్యంతో బహుళ ప్రయోజనాలున్న ఈ పరిశ్రమను నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. ఈ ప్లాంటు ద్వారా ఇథనాల్తోపాటు మొదటి దశలో రోజూ 250 కిలోలీటర్ల కార్న్ బ్రాన్ ఆయిల్, రెండో దశలో రోజుకు 250 కిలోలీటర్ల రైస్బ్రాన్ ఆయిల్ను ఉత్పత్తి చేస్తారు. మొత్తంగా రోజుకు ఐదు లక్షల లీటర్ల ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. ప్లాంటుకు ఏటా లక్ష టన్నుల వరి, మక్కజొన్న ధాన్యం అవసరం అవుతుంది. సారవంతమైన భూములు, ఎస్సారెస్పీ, కాళేశ్వరం ప్రాజెక్టులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీగా వరి, మక్కజొన్న సాగవుతున్నది.
జగిత్యాల జిల్లాలోనే 2.94 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. పరిశ్రమకు అవసరమైన నీరు, వరి, మక్కలు పుష్కలంగా లభిస్తుండటంతో ఇథనాల్ ప్లాంట్ను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్లాంటు ఏర్పాటుతో జగిత్యాల జిల్లాలో యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ పరిశ్రమలో ఒకేసారి ఇథనాల్తోపాటు నూనెలను కూడా ఉత్పత్తి చేస్తారు. వరి ధాన్యాన్ని మరాడిస్తే వచ్చే తవుడు నుంచి రైస్బ్రాన్ ఆయిల్ను ఉత్పత్తి చేస్తారు. మక్కల నుంచి కార్న్ ఆయిల్ తీస్తారు.
రైస్బ్రాన్ అయిల్ను వంటనూనెగా నేరుగా విక్రయించే వీలున్నది. కార్న్ అయిల్ కూడా వంట నూనె గా అనువైనదే అయినప్పటికి మనరాష్ట్ర వాతావరణం, భిన్న శీతోష్ణస్థితి నేపథ్యంలో ఆ అవకాశం లేదు. దీనిని రైస్బ్రాన్, పొద్దుతిరుగుడు, వేరుశనగ నూనెల్లో బ్లెండ్ చేసి విక్రయిస్తారు. చెరకు, మక్క, వరి నుంచి ఇథనాల్ను సంప్రదాయబద్దంగా తీస్తారు. ఇథనాల్ను బయో డీజీల్గా, ఫార్మా, మద్యం తయారీ పరిశ్రమల్లో విరివిగా వినియోగిస్తున్నారు. ధర్మపురి నియోజకవర్గంలో ప్లాంటు స్థాపనకు అనువైన స్థలంకోసం అధికారులు సర్వే చేస్తున్నారు. నిర్మాణ పనులు ప్రారంభమైన ఆరు నెలల్లో మొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించారు.
నా జీవితంలో నవంబర్ 17 రెండో మంచిరోజు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటురోజు తర్వాత రెండో సంతోషకరమైన రోజు ఇదే. మారుమూల ప్రాంతమైన ధర్మపురిలో ఇథనాల్ పరిశ్రమ మంజూరు చేయడం అమితానందం కలిగించింది. దళితులు అత్యధికంగా ఉన్న ప్రాంతం ధర్మపురి. ఇక్కడి ప్రజలకు సేద్యం తప్ప మరేమీ తెలియదు. ఇవన్నీ పరిశీలించిన మంత్రి కే తారకరామారావు.. సీఎం కేసీఆర్ను ఒప్పించి ఫ్యాక్టరీని మంజూరు చేయించారు. ప్లాంటు ఏర్పాటుతో వేలమంది స్థానికులకు ఉపాధి లభిస్తుంది. మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. – సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్