నేడు కొమురవెల్లి మల్లన్న కల్యాణం
అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయవర్గాలు
వేడుకకు వేలాదిగా రానున్న భక్తులు
కొవిడ్ నిబంధనలతో ఉత్సవాలు
పట్టు వస్ర్తాలు సమర్పించనున్న మంత్రి హరీశ్రావు
50వేల మాస్కులు, శానిటైజర్లు సిద్ధం
250 మందితో పటిష్ట పోలీస్ బందోబస్తు
చేర్యాల, డిసెంబర్ 25 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైయ్యింది. నేడు మల్లన్న కల్యాణం నిర్వహించనున్నారు. కల్యాణానికి ఆలయవర్గాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఆలయంలోని గంగిరేగు చెట్టు తదితర ప్రదేశాల్లో చలువ పందిళ్లు వేశారు. కల్యాణ వేదికను ముస్తాబు చేయడంతో పాటు ఆలయ సుందరీకరణ పనులు పూర్తి చేశారు. తోటబావి ప్రాంతంలో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక వద్ద బారికేడ్లు, షామియానాలు, పచ్చదనం ఉట్టిపడే విధంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. సిద్దిపేట, జనగామ జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. కరీంనగర్, సిద్దిపేట, జనగామ, హన్మకొండ, గోదావరిఖని, జగిత్యాల తదితర బస్సులు కొమురవెల్లి స్టేజీ వద్ద నిలుపేందుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాహనాల కోసం మూడు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. వైశ్య సత్రం, బతుకమ్మ చెరువు వద్ద, వీఐపీలకు తోటబావి వద్ద పార్కింగ్ స్థలాలను కేటాయించారు. ఏసీపీ ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలు, 15 మంది ఎస్సైలతో పాటు ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు, 250 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.