Khammam | కారేపల్లి (ఖమ్మం) నవంబర్ 24: ఖమ్మం పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో నాణ్యత ప్రమాణాలతో కూడిన భోజనం పెట్టడం లేదని సోమవారం రాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. చేతిలో ప్లేట్లు పట్టుకుని బల్లేపల్లిలోని కాలేజీ క్యాంపస్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ తీశారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు.
పట్టణంలోని బల్లేపల్లి శాఖలో సుమారు 250 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కాలేజీ హాస్టల్లోనే ఉంటున్నారు. అయితే హాస్టల్లో ఉండే తమకు నాణ్యమైన భోజనం పెట్టకపోవడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి కూడా నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో ఆందోళనకు దిగారు. ప్లేట్లు చేతిలో పట్టుకుని క్యాంపస్ నుంచి బయటకు వచ్చేశారు. ఎన్టీఆర్ సర్కిల్ వరకు కాలేజీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో బైఠాయించిన ఆందోళన చేశారు. లక్షల రూపాయలు చెల్లించి కళాశాలలో ప్రవేశాలు పొందిన తమకు భోజనం రుచికరంగా పెట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పలుమార్లు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు.