హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఇకపై రాష్ట్రం నుంచి దొడ్డు బియ్యం (బాయిల్డ్ రైస్) ఎట్టి పరిస్థితుల్లోనూ కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. గురువారం ఒకపక్క ముఖ్యమంత్రి కేసీఆర్ సహా సమస్త రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం తీవ్రస్థాయిలో మహాధర్నా చేస్తున్న సమయంలోనే గుట్టుచప్పుడు కాకుండా ఎవరి సంతకం లేకుండా.. కేంద్ర ఆహార ప్రజా పంపిణీశాఖ జాయింట్ సెక్రటరీ తెలంగాణకు చెందిన కొందరు విలేకరులను పిలిచి ఒక నోట్ కాపీని అందించారు. ఇకపై పార్బాయిల్డ్ రైస్ (దొడ్డు బియ్యం) కొనబోయేది లేదని విస్పష్టంగా చెప్పింది.
బాయిల్డ్ రైస్ విసయంలో కేంద్రం మూర్ఖంగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘కేంద్రం ఏమైనా ప్రైవేట్ వ్యాపార సంస్థనా? ఉన్న నిల్వలను ఏ విధంగా వినియోగించాలనే మార్గాలను అన్వేషించి, వాటిని ఉపయోగించి రైతుల నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలి. తినుబండారాలు కావొచ్చు, ఇతర ఏవైనా కావొచ్చు.. దేశంలో ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం తమ అవసరాలకు మేరకు ఉత్పత్తి చేసుకోగలదా? లేదు కాబట్టే ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువులను మరో రాష్ట్రంలోని ప్రజల అవసరాల కోసం తరలిస్తారు. కేంద్రానికి ఆ మాత్రం బాధ్యత లేకుంటే సమాఖ్య స్ఫూర్తి ఏమైనట్టు?’ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల ఇక్కడ బాయిల్డ్ రైస్ మాత్రమే ఉత్పత్తి అవుతాయి. కేంద్రం మాత్రం బాయిల్డ్ రైస్ను కాకుండా రా రైస్ తీసుకుంటామని అంటున్నది. ఒకవేళ బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ ఇద్దామంటే సగానికి సగం నూక రూపంలో వృథా అవుతుంది. మరి ఆ ఖర్చు ఎవరు భరించాలి? మధ్యవర్తిగా ఉంటూ కొనుగోలు చేసిన పాపానికి రాష్ట్రం భరించాలా? లేదా వడ్లను పట్టి బియ్యం ఇస్తున్నందుకు రైస్ మిల్లర్లు భరించాలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రా రైస్ ఎంతైనా తీసుకుంటామని ఊదరగొడుతున్న కేంద్రం.. అసలు విషయానికి వచ్చేసరికి దాటవేత ధోరణి అవలంబిస్తున్నదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ వానకాలంలో 135 లక్షల టన్నుల ధాన్యం (90 లక్షల టన్నుల బియ్యం) వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తే.. తాము 60 లక్షల టన్నుల ధాన్యం (40 లక్షల టన్నుల బియ్యం) మాత్రమే కొనుగోలు చేస్తామని మొండి వాదనలు వినిపిస్తున్నదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మిగతా బియ్యం పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తే.. పరిశీలిస్తున్నామంటూ కాలయాపన చేస్తున్నదే తప్ప స్పష్టత ఇవ్వడం లేదని చెప్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రైతులను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాల్నో కేంద్రం మార్గాలను వెతుకుతున్నదన్న అభిప్రాయం వినిపిస్తున్నది. వానకాలంలో తెలంగాణలో 61 లక్షల ఎకరాల్లో వరి సాగైందని రాష్ట్రం నివేదిక ఇస్తే.. 41.74 లక్షల ఎకరాల్లోనే సాగైందని నిందలు మోపారు. మేం చెప్పేది తప్పయితే మీరే సర్వే చేయండంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో కేంద్ర ప్రభుత్వ సంస్థనే రిమోట్ సెన్సింగ్ ద్వారా సర్వే చేసి 58.66 లక్షల ఎకరాల్లో సాగైందని తేల్చింది. తాజా నోట్లో కూడా ఇది స్పష్టమైంది.
యాసంగిలో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇచ్చినట్లు కేంద్రం చెప్తున్న మాట వాస్తవమే. కానీ ఆలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ఆ మాట మాత్రం నోట్లో చెప్పక పోవడం గమనార్హం. గత యాసంగి బియ్యం పూర్తిగా తీసుకోవాలంటే వచ్చే యాసంగిలో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాతపూర్వకంగా ఒప్పుకొంటేనే తీసుకొంటామంటూ పీకమీద కత్తిపెట్టినట్టు బెదిరించిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అప్పటి ఆపత్కాల పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అలా వ్యవహరించిందని గుర్తు చేస్తున్నాయి. కానీ ఆ విషయాలేవీ కేంద్రం గానీ, బీజేపీ నేతలు గానీ ఎక్కడా చెప్పకపోవడం విశేషం.