హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): వాణిజ్య ఒప్పందాల్లో వివాదాలు తలెత్తడం సహజమే. కానీ అవి త్వరగా పరిష్కారమవడం చాలా ముఖ్యం. ఇలాంటి వివాదాలకు మన న్యాయస్థానాల్లో పరిష్కారం లభించడం ఎంతో జాప్యంతో కూడిన వ్యవహారమని అంతర్జాతీయ సమాజం భావన. భారత్లో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థలకు, దేశీయ కంపెనీలతో జతకట్టేందుకు ఇదొక పెద్ద లోటుగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) హైదరాబాద్లో రాబోతున్నది. దీని ఏర్పాటుతో వాణిజ్య వివాదాలు సత్వరమే పరిష్కారమవుతాయని, దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు విదేశీ వాణిజ్యానికీ ఇది ఎంతో దోహదం చేయగలదన్న అభిప్రాయాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. నిజానికి ఇరువర్గాల పరస్పర ఆమోదం ద్వారా మధ్యవర్తిత్వంతో వివాదాలను పరిష్కరించుకొనే ఆనవాయితీ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నదే. దీనికి కాస్త భిన్నంగా వ్యవహరించే ఐఏఎంసీ.. యూజర్ ఫ్రెండ్లీ రూల్స్తో కోర్టు మార్గదర్శకాల ప్రకారం కొనసాగుతుంది. ప్రస్తుతం వివిధ దేశాలు, సంస్థల మధ్య తలెత్తుతున్న వాణిజ్య వివాదాల పరిష్కారానికి లండన్, స్టాక్హోమ్, ప్యారిస్ ఐసీసీ (ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్), ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, హాంకాంగ్, సింగపూర్ తదితర ప్రాంతాల్లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్లే దిక్కు. దీంతో భారతీయ కంపెనీలకు, వాటి విదేశీ భాగస్వాములకు మధ్య తలెత్తిన దాదాపు 500 వివాదాలు గతేడాది సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు, మరో 120 వివాదాలు ప్యారిస్ ఐసీసీకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్లో ఐఏఎంసీ ఏర్పాటవుతుండటం మన వాణిజ్య వర్గాలకు ఎంతో లాభమనడంలో సందేహం లేదు.
విదేశీ వాణిజ్యంలో ముఖ్యంగా ఎగుమతులు, దిగుమతులతోపాటు చెల్లింపులు, మేథో సంపత్తితో కూడుకున్న ఒప్పందాల్లో వివాదాలు తరచూ తలెత్తుతున్నాయి. పేటెంట్, సాఫ్ట్వేర్ లైసెన్సులు, ట్రేడ్మార్క్ ఒప్పందాలు, ఔషధ ఉత్పత్తులకు సంబంధించిన పంపిణీ అగ్రమెంట్లు, పేటెంట్ హక్కుల ఉల్లంఘనలు, పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన ఒప్పందాలు ముఖ్యమైవి.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని నానక్రామ్గూడలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో కేసుల విచారణ జరిగేలా ఐఏఎంసీని తీర్చిదిద్దుతున్నారు. 160 భాషల ట్రాన్స్లేషన్ సౌకర్యం కూడా ఏర్పాటుచేస్తున్నారు. 16,000 చదరుపు అడుగుల విస్తీర్ణంలో, 22 అంతస్తుల్లో దీన్ని నిర్మిస్తున్నారు. ఎయిర్పోర్టు నుంచి అతి దగ్గరగా ఉండటమే కాకుండా సమీపంలోనే అనేక హోటళ్లు కూడా ఉండటం విశేషం.
ప్రస్తుతం దేశీయ వ్యాపార, పారిశ్రామికవేత్తలు.. విదేశీ సంస్థలతో జరిగే ఎగుమతి, దిగుమతుల ఒప్పందాల్లో తలెత్తే వివాదాల పరిష్కారానికి స్విట్జర్లాండ్, సింగపూర్ తదితర దేశాల్లోని ఆర్బిట్రేషన్ సెంటర్లకు వెళ్తున్నారు. మన రాష్ట్రంలో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటైతే ఇతర దేశాలకు వెళ్లే అవసరం ఉండదు. వివాదాలు సత్వరం పరిష్కరమయ్యే వీలు కలుగుతుంది. దీనివల్ల సమయంతోపాటు ఖర్చులు కూడా చాలా తగ్గుతాయి. ఇతర దేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడి ఎంఎస్ఎంఈలతో ఒప్పందాలు చేసుకునేందుకూ ముందుకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.
సుధీర్ రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ మన దేశంలో, ముఖ్యంగా తెలంగాణలో ఏర్పాటు అవుతుండటం ఎంతో సంతోషకరం. ఇది మన వాణిజ్య, పారిశ్రామిక వర్గాలకు ఎంతగానో మేలు చేకూర్చుతుంది. ముఖ్యంగా ఇతర దేశాలతో జరిగే ఎగుమతులు, వాణిజ్య ఒప్పందాల్లో ఏర్పడే వివాదాల పరిష్కారం కోసం ఇతర దేశాల కోర్టులకు వెళ్లే బాధ తప్పుతుంది. దీనివల్ల ఖర్చు తగ్గడమే కాకుండా ఎంతో సమయం కూడా ఆదా అవుతుంది.
గౌతమ్ చంద్ జైన్, పోకర్ణ సంస్థ సీఎండీ
ఇతర దేశాలకు చెందిన పెట్టుబడిదారులు భారత్లో న్యాయ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుందని భయపడుతున్నారు. ఈ ఆర్బిట్రేషన్ సెంటర్ వల్ల ఆ భయం పోతుంది. వారు ధైర్యంగా పెట్టుబడులు పెట్టేందుకు, ఇక్కడి సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేందుకు ముందుకొస్తారు. ముఖ్యంగా ఎగుమతులు, దిగుమతుల్లో తలెత్తే వివాదాలు వెంటనే పరిష్కారమయ్యే వీలున్నది కాబట్టి వాణిజ్యం వృద్ధి చెందేందుకు దోహద పడుతుంది.
భాస్కర్ రెడ్డి, ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు