నిజామాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభిస్తున్నది. గులాబీ బాస్ నేరుగా ఫీల్డ్లోకి దిగడంతో పార్టీలో నూతనోత్సాహం వెల్లివెరిస్తున్నది. కేసీఆర్ రోడ్షోలకు జనం వెల్లువెత్తుతున్నారు. ఎక్కడకు వెళ్లినా మాజీ సీఎంకు బ్రహ్మరథం పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ వెనుకబడిందని ప్రచారం చేసిన ప్రత్యర్థి పార్టీలకు మింగుడు పడడం లేదు. కేసీఆర్ టూర్కు వస్తున్న స్పందనను చూసి ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీకి కునుకు పట్టడం లేదు.
ఆరోగ్యం సహకరించక పోయినప్పటికీ ప్రజల కోసం, తెలంగాణ బాగు కోసం కదిలిన బీఆర్ఎస్ అధినేతకు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. ఏప్రిల్ 24న మొదలైన బస్సుయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. రైతులు, పేదలు, మహిళలు, యువకులు తరలి వచ్చి కేసీఆర్కు జేజేలు కొడుతున్నారు. మార్పు పేరుతో కాంగ్రెస్ చేసిన మోసాన్ని గులాబీ బాస్ దృష్టికి తీసుకొస్తున్నారు. అబద్ధాల హామీలతో బొటాబొటి మెజార్టీతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మెడలు వంచే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని జనం స్పష్టం చేస్తున్నారు. నమ్మించి జనాలను నట్టేట ముంచిన హస్తం పార్టీకి లోక్సభ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలన్న కేసీఆర్ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్తున్నది. రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల్లో కేసీఆర్కు అండగా నిలువాలన్న తాపత్రాయం కనిపిస్తున్నది.
కేసీఆర్ బస్సుయాత్రకు వస్తున్న అపూర్వ స్పందనతో బీజేపీ, కాగ్రెస్ పార్టీల్లో కలవరం మొదలైంది. అదే సమయంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. గెలుపు అవకాశాలు భారీగా పెరగడంతో గులాబీ నేతలంతా రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అనేక లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం సహకరించుకుంటున్నాయని బలంగా ప్రచారం జరుగుతున్నది. ఈ కుట్రను ఛేదిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి వాస్తవాలను చెబుతూ అవగాహన కల్పిస్తున్నారు. స్వల్ప ఓట్ల ఆధిక్యంతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ తీరును కేసీఆర్ అడుగడుగునా ఎండగడుతున్నారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని విడమరిచి చెప్పడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తవుతున్నా సీఎం రేవంత్రెడ్డి కేవలం రాజకీయ ఆరోపణలు మినహా రాష్ర్టాభివృద్ధి, ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టడం లేదు. పైగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. ఈ పరిస్థితులను కేసీఆర్ తనదైన శైలిలో ప్రజలకు విశదీకరిస్తున్నారు. ఉద్యమ కాలంలో సంధించిన మాటల తూటాలను బస్సు యాత్రలో పేలుస్తూ కాంగ్రెస్ బండారాన్ని బట్టబయలు చేస్తూ దిగ్విజయంగా బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఉమ్మడిగా కుట్రలు చేస్తున్నప్పటికీ గులాబీ దళపతి మాత్రం మొక్కవోని దీక్షతో ప్రజల్లోకి వెళ్తూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. నిజామాబాద్ లోక్సభ పరిధిలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్తో పాటు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జహీరాబాద్ లోక్సభ పరిధిలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్తో పాటు సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్ఖేడ్, ఆలేరు, జహీరాబాద్ ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో కేసీఆర్ బస్సు యాత్ర మూడు రోజుల పాటు కొనసాగనున్నది. మే 5న జగిత్యాల జిల్లాలో కేసీఆర్ రోడ్షో నిర్వహించనున్నారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. తర్వాతి రోజు మే 6న కేసీఆర్ నిజామాబాద్లో పర్యటించనున్నారు. రాత్రి ఇందూరులోనే విశ్రాంతి తీసుకుంటారు. మే 7న కామారెడ్డిలో రోడ్షో అనంతరం మెదక్ జిల్లాకు బయల్దేరి వెళ్తారు. మొత్తం మూడు రోజుల పాటు మూడు జిల్లాల్లో రెండు లోక్సభ స్థానాల్లో కేసీఆర్ పర్యటన కొనసాగనున్నది. బాస్ పర్యటనకు భారత రాష్ట్ర సమితి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. కేసీఆర్ పోరుబాటలో భాగంగా బస్సుయాత్రలో బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, ప్రజాప్రతినిధులంతా పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.