భారతదేశ నైపుణ్యాలకు పర్యాయపదంగా, ఒకనాడు ప్రపంచం మొత్తం అబ్బురపడేలా చేసిన ఖాదీకి కేంద్రం ఉరి వేస్తున్నది. చేతితో నేసిన బట్టతో మాత్రమే జాతీయ జెండాను తయారు చేయాలని ‘ఫ్లాగ్ కోడ్-2002’ తెలియజేస్తున్నది. కానీ, మోదీ సర్కారు జాతీయ జెండాను ఖాదీతోపాటు ప్లాస్టిక్, పాలిస్టర్తోనూ తయారు చేయవచ్చని చట్టాన్ని సవరించింది. కేంద్రం అనాలోచితంగా తీసుకొచ్చిన ఈ నిబంధన ఇప్పుడు ఖాదీ కార్మికులకు ఉరితాడు బిగిస్తున్నది.
న్యూఢిల్లీ, జూలై 28: భారత్ ఈ ఏడాది 75వ స్వాతంత్య దినోత్సవాలను జరుపుకోబోతున్నది. ఇది ప్రతి భారతీయుడూ గర్వంగా చెప్పుకొనే విషయం. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ఎంతో ఆర్భాటంగా ఓ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. దేశ చరిత్ర, సంస్కృతి, కళలు, వృత్తుల గురించి ప్రపంచానికి చాటిచెప్పేలా ప్రచారం కూడా చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్నది. కానీ, భారతదేశ నైపుణ్యాలకు పర్యాయపదంగా, ఒకనాడు ప్రపంచం మొత్తం అబ్బురపడేలా చేసిన ఖాదీకి మాత్రం ఉరి వేస్తున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ భారత జాతీయ జెండా అంటే అది కచ్చితంగా ఖాదీ వస్త్రంతోనే తయారై ఉండేది. ఇతర అది కూడా చేతితో నేసిన బట్టతో మాత్రమే జాతీయ జెండాను తయారు చేయాలని ‘ఫ్లాగ్ కోడ్-2002’ స్పష్టంగా తెలియజేస్తున్నది. కానీ, మోదీ సర్కారు 2021లో ఈ చట్టానికి సవరణలు చేసి జాతీయ జెండాను ఖాదీతోపాటు ప్లాస్టిక్, పాలిస్టర్తోనూ తయారు చేయవచ్చని నిబంధనలు మార్చింది. కేంద్రం అనాలోచితంగా తీసుకొచ్చిన ఈ నిబంధన ఇప్పుడు ఖాదీ కార్మికులకు ఉరితాడు బిగిస్తున్నది.
కర్ణాటకలోని హుబ్లీలో చేనేత సంఘాలు చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో జాతీయ జెండాను నేస్తూ నిరసన
జెండా తయారీ ఓ యజ్ఞం
మనదేశంలో జాతీయ జెండా తయారీకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) గుర్తింపు ఇచ్చిన ఏకైక సంస్థ కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘ (కేకేజీఎస్ఎస్). ఏటా ప్రభుత్వం ఈ సంస్థకు మాత్రమే జెండా తయారీకి ఆర్డర్లు ఇస్తుంది. ప్రతి ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఈ సంస్థకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఆర్డర్లు వచ్చేవి. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాలు జరుపుకొంటుండటంతో భారీగా ఆర్డర్లు వస్తాయని ఆ సంస్థ ఆశించింది. కానీ, ఇప్పటివరకు కేకేజీఎస్ఎస్కు వచ్చిన ఆర్డర్ల విలువ కేవలం రూ.1.5 కోట్లు. అందుకు కారణం ప్లాస్టిక్తో కూడా జెండాలు తయారు చేయవచ్చు అని మోదీ సర్కారు తెచ్చిన కొత్త నిబంధన. దీనితోపాటు యంత్రాలపై కూడా జాతీయ జెండాలు తయారు చేయవచ్చని చట్ట సవరణలో కేంద్రం సడలింపు ఇచ్చింది. నిజానికి మొదటి నుంచీ జాతీయ జెండా కోసం చేనేత వస్ర్తాన్నే వాడుతున్నారు. అదికూడా ఏకపోగు దారంతో నేసిన వస్ర్తాన్నే వాడుతున్నారు. ఇందులో రెండుమూడు దశలు ఉంటాయి. మొదట చేతితో వస్ర్తాన్ని నేస్తారు. దానిని దర్జీలు నిబంధనల మేరకు కచ్చితమైన కొలతలతో జెండాగా కుడతారు. ఆ జెండాలను మడతపెట్టి ప్యాక్ చేసే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందుకోసం కూడా కొంతమంది పనిచేస్తుంటారు. ప్రతి దశలోనూ కార్మికులు ఎంతో శ్రద్ధగా, ఓ యజ్ఞంలా పనిచేస్తారు. ఇలా తయారైన జెండా కొంచెం ఖరీదైనది. కానీ వందలమంది కార్మికులు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. చట్ట సవరణతో యంత్రాలపై జెండాలను తయారు చేయటంతో తక్కువ ధరకు లభిస్తున్నాయి. అందునా ప్లాస్టిక్ జెండాలు మరీ తక్కువ ధరకు దొరుకుతున్నాయి. దీంతో చేనేత జెండాలను కొనేవారే కరువయ్యారు.
ఉపాధికి ఎసరు
కేంద్రం తెచ్చిన చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకొని నేత కార్మికులను ఆదుకోవాలని కేకేజీఎస్ఎస్ బుధవారం నుంచి ఉద్యమం మొదలుపెట్టింది. కర్ణాటకలోని హుబ్లీలో ఆందోళన నిర్వహించారు. కేంద్రం నిర్వాకంతో వందలమంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని కేకేజీఎస్ఎస్ కార్యదర్శి శివానంద మాతపాటి ఆందోళన వ్యక్తంచేశారు. ఎంతో నిబద్ధతతో జాతీయ జెండాలు తయారుచేసే కార్మికులకు వచ్చే నెలవారీ వేతనం రూ.10 వేలు కూడా మించదు. టైలరింగ్, స్పిన్నింగ్ వంటి పనులు చేసే రోజు కూలీలకైతే నెలకు వచ్చే ఆదాయం రూ.4 వేలలోపే. కార్మికుల్లో చాలామంది మహిళలే. వారికి సొంత ఇండ్లు కూడా లేవని శివానంద తెలిపారు. హుబ్లీలోని బెంగెరె యూనిట్లో 600 మంది, బాగల్కోట్లో 1300 మంది పని చేస్తున్నారు. ఇంతమంది ఉపాధి ఇప్పుడు ప్రమాదంలో పడిందని శివానంద ఆవేదన వ్యక్తం చేశారు.
ప్లాస్టిక్పై నిషేధం.. ప్లాస్టిక్ జెండాలకు ఆమోదం
మోదీ ప్రభుత్వం ఈ నెల 1 నుంచి దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం విధించింది. అంటే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులను ఇకమీదట వాడకూడదు. అదే సమయంలో ప్లాస్టిక్ జెండాలకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఆగస్టు 15, జనవరి 26 తర్వాత రోజు రోడ్లపై ఎక్కడ చూసినా జాతీయ జెండాలే కనిపిస్తున్నాయి. పిల్లలు, పెద్దలు చేతిలో పట్టుకొని ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్లాస్టిక్తో చిన్నచిన్న జెండాలను తయారు చేస్తున్నారు. ఉత్సవాలు అయిపోయిన తర్వాత వాటిని ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. దీనిపై ఇప్పటికే చాలామంది అభ్యంతరాలు కూడా లేవనెత్తారు. అయినా, కేంద్రం మేల్కొనకుండా ఒకవైపు ప్లాస్టిక్ను నిషేధిస్తూ, మరోవైపు ప్లాస్టిక్ జెండాలకు అనుమతి ఇవ్వటమేమిటని ప్రజలు నిలదీస్తున్నారు.
మాకు ఈ పనే సర్వస్వం
ఖాదీకి ఉన్న ప్రాధాన్యం దేశం మొత్తానికి తెలుసు. ఖాదీకి మనదేశంలో ఓ చరిత్ర ఉన్నది. గొప్ప గౌరవం ఉన్నది. మాకు తక్కువ వేతనాలున్నా జాతీయ జెండాలు తయారు చేస్తున్నందుకు గర్వపడుతుంటాం. నేను ఇక్కడ 18 ఏండ్లుగా పనిచేస్తున్నా. నాకు ఈ పని తప్ప మరేమీ తెలియదు. ప్రభుత్వం మా నుంచి జీఎస్టీ వంటి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నది. ముడి సరుకుల ధరలు పెంచి ఆ రూపంలోనూ ఆర్జిస్తున్నది. దీంతో తయారీ ఖర్చులు తగ్గించేందుకు మా వేతనాలు తగ్గిస్తున్నారు. అయినా, మేం చేస్తున్న పనిలో సంతోషంగానే ఉన్నాం. కానీ, కేంద్రం తన నిర్ణయాలతో మా కాళ్లు నరుకుతున్నది.
– రెహానా బల్లారి, కార్మికురాలు