ఎనిమిదేండ్ల వయస్సున్న తెలంగాణను ప్రపంచంతో పోటీపడేలా పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ పాలనా దక్షత దేశానికి అవసరమని పొరుగు రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు పథకాలు, సబ్బండ వర్ణాలను ఆదుకొనే అనేక స్కీములను ప్రత్యక్షంగా, పరోక్షంగా చూసిన ఆ రాష్ర్టాల ప్రజలు.. తమ రాష్ట్రంలో పాలనను బేరీజు వేసుకొని కేసీఆర్కు జై కొడుతున్నారు. బీజేపీ పాలనలో కమీషన్ల రాష్ట్రంగా పేరుపొందటంపై అక్కడి సర్కారును కర్ణాటక ప్రజలు చీదరించుకొంటున్నారు. కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమమే గుర్తొస్తదని.. పోరాడి రాష్ర్టాన్ని తీసుకొచ్చిన ఘనత ఆయనదని, కేసీఆర్ లాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘విధుల్లో భాగంగా కర్ణాటక అంతా తిరుగుతుంటా. ఇక్కడ రోడ్లు, పింఛన్లు, ప్రజల స్థితిగతులు పెద్దగా బాగుండవు. తెలంగాణకూ వస్తుంటా.. అక్కడి అభివృద్ధితో పోల్చితే కర్ణాటక వెనుకబడిన రాష్ట్రం’ అని ఓ ప్రైవేట్ కంపెనీ మేనేజర్ రవి చెప్పారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): అది కర్ణాటకలోని రాయచూర్ జిల్లా. ఒకప్పుడు నిజాం పాలనలో ఉన్న ప్రాంతం. నిజాం సంస్థానంలో కలబురగి, బీదర్, యాద్గిర్, కొప్పల్, బళ్లారి, విజయనగర తదితర జిల్లాలతో రాయచూర్ ఒక భాగంగా ఉండేది. దీన్ని హైదరాబాద్ కర్ణాటక అని పిలిచేవాళ్లు. ఇక్కడ దేవార్సుగుర్, చిక్సుగుర్, శక్తినగర్ చిన్న గ్రామాలున్నాయి. ఇవి తెలంగాణ నారాయణపేట జిల్లా మక్తల్ మండల సరిహద్దును ఆనుకొని ఉంటాయి. ఒక్కో గ్రామ జనాభా సుమారు 1500 నుంచి 2800. రాయచూర్ జిల్లాకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇక్కడ కర్ణాటక రాజకీయాలతోపాటు తెలంగాణ రాజకీయాలను బాగా గమనిస్తారు. ఈ గ్రామాల అభివృద్ధి అంతంత మాత్రమే. ఎక్కడ చూసినా కూలిపోయే ఇండ్లు..రోడ్లన్నీ అపరిశుభ్రంగా ఉంటాయి. తాగునీటి సరఫరా అరకొరే. ఆ గ్రామాల్లో అమలవుతున్న పథకాలు, అభివృద్ధి గురించి ఆరా తీయగా ‘కర్ణాటక రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి.. ఒకరి తర్వాత ఒకరు దిగిపోతూ ఉంటారు. రెండేండ్లకు మించి సీఎం కుర్చీలో ఉండరు. పదవిని కాపాడుకునేందుకు యత్నిస్తే.. ప్రజలను ఎవరు పట్టించుకుంటారు ?’ అని అన్నారు శక్తినగర్కు చెందిన నాగేంద్ర. ప్రస్తుత సీఎం బొమ్మైని కూడా మార్చబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. దేవార్సుగుర్ గ్రామానికి చెందిన నరేశ్ అనే దుకాణాదారుడు మాట్లాడుతూ..‘మా సరిహద్దు గ్రామాల వాళ్లం మహబూబ్నగర్కు వివిధ పనుల కోసం వెళుతుంటాం. పెండ్లి సంబంధాలు కూడా ఇచ్చి పుచ్చుకుంటాం. మా గ్రామాలను తెలంగాణలో కలుపుకొంటే మేము బాగుపడ్తం’ అని అన్నారు. మరో రైతు నారప్ప..‘పంట నష్టమొచ్చి 3 ఎకరాలు దెబ్బతిన్నది. మా అధికారులు వచ్చిపోయారే కానీ ఇప్పటివరకు సాయం అందించలేదు’ అని వాపోయారు.
ఈసారి బీజేపీకి బుద్ధి చెప్తాం..
రాయచూర్లో ఇప్పటికీ నిజాం రాజుల కోటలు, శిల్పకళలు సాక్షాత్కారిస్తుంటాయి. 1948లో హైదరాబాద్ సంస్థానం అధికారికంగా భారత్లో విలీనమయ్యాక కొన్ని జిల్లాలను కర్ణాటకలో కలిపేశారు. అయితే ఈ ప్రాంతం ఇప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నది. ప్రధాన వీధులన్నీ అపరిశుభ్రంగా ఉంటాయి. టాయిలెట్ల వసతి లేకపోవడంతో వ్యాపారాలు జరుగుతున్న రోడ్ల మీదే బహిరంగ విసర్జన చేస్తున్నారు. స్చచ్ఛభారత్ అంటూ గొప్పలు చెప్పుకొనే బీజేపీ పాలిత కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులు అడుగడుగునా అనేకం. జిల్లాకు చెందిన అజయ్ కోరె అనే మెడికల్ షాప్ నిర్వాహకుడు మాట్లాడుతూ.. ‘ రాయచూర్లో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని చేస్తున్న ఉద్యమం 100 రోజులు దాటింది. ఇప్పటివరకు ఒక్కరు కూడా స్పందించలేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతాం. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఆసన్నమైంది’ అన్నారు. అదే జిల్లాకు చెందిన వెంకటమ్మ అనే మహిళా మాట్లాడుతూ..‘తెలంగాణలో శాంతిభద్రతలు బాగుంటాయి. మహిళల రక్షణకు షీటీమ్స్, భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయి. తక్షణమే న్యాయం జరిగే వ్యవస్థను తీసుకొచ్చారు. సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా తెలిసిన నాయకుడు’ అని తెలిపారు.
విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్
కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమమే గుర్తొస్తదని, పోరాడి రాష్ర్టాన్ని తీసుకొచ్చిన ఘనత ఆయనదని, కేసీఆర్ లాం టి నాయకుడు దేశ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉన్నదని యాద్గిర్ జిల్లా కు చెందిన టీచర్ విజయ్కుమార్ అన్నా రు. కలబురగి జిల్లాలోని గణపురం, బొల్లంపల్లి, కుంచరక్రాస్, గొట్టెంగుట్ట, చించోలి తండాల్లో ప్రజలు కేసీఆర్ జాతీ య రాజకీయాల్లోకి వస్తేనే ప్రగతి పట్టాలెక్కుతుందని పేర్కొన్నారు. విధుల్లో భా గంగా కర్ణాటక అంతా తిరుగుతుంటానని, ఇక్కడ రోడ్లు, పింఛన్లు, ప్రజల స్థితిగతులు పెద్దగా బాగుండవని ఓ ప్రైవేట్ కంపెనీ మేనేజర్ రవి చెప్పారు. తెలంగాణకూ వస్తుంటామని, అక్కడి అభివృద్ధితో పోల్చితే కర్ణాటక వెనుకబడిన రాష్ట్రమని చెప్పారు. చించోలి అద్భుతమైన ప ర్యాటక ప్రాంతమని, సరైన రోడ్లు లేకపోవడం వల్ల పెద్దగా పర్యాటకులు రావడం లేదని స్థానిక పీజీ విద్యార్థి నారాయణ చెప్పారు. వారసత్వ సంపదను కాపాడుకోవాలనే ధ్యాస ఇక్కడి సర్కారుకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
షాదీముబారక్తో గొప్ప సాయం
తెలంగాణ రాకముందు హైదరాబాద్లో మతఘర్షణలు జరిగేవి. ఇప్పుడు అలాంటి వార్తలు వినిపించడం లేదు. హిందూ, ముస్లింల సఖ్యతను కాపాడుతున్న నాయకుడు. షాదీ ముబారక్ లాంటి పథకంతో ఆడబిడ్డల పెండ్లికి లక్ష రూపాయలు సాయం చేయడం గొప్ప విషయం. ముస్లిం కుటుంబాలకు ఎంతో తోడ్పడుతుంది.
– మహ్మద్ ముస్తాఖ్, మటన్షాప్ నిర్వాహకుడు
కేసీఆర్ వెంటే నడుస్తాం
సీఎం కేసీఆర్ అంటే తెలియని వాళ్లు కర్ణాటకలో ఎవరూ లేరు. ప్రతిరోజు తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను టీవీల్లో చూస్తుంటాం. ప్రజల బాగోగులు పట్టించుకునే ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే. హైదరాబాద్ నడిబొడ్డులో నిరుపేదలకు అందమైన భవంతులు కట్టించి పేదల బాధలు తీర్చిండు. ఆకలిగా ఉన్నవాళ్లకు రూ.5తో కడుపునింపుతున్నాడు. బిడ్డ పెండ్లి జేస్తే కల్యాణలక్ష్మి ఇస్తుండు. ఆసరా పింఛన్లు, సర్కార్ దవాఖానలు గొప్పగా ఉన్నాయి. కర్ణాటకలో అట్లాంటి పథకం ఒక్కటీ లేకపోవడం మా దౌర్భాగ్యం.
– శ్రీనివాస్, వ్యాపారి, రాయచూర్
ఆడపిల్లలను తెలంగాణకు ఇస్తున్నాం
తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లాడు పుడితే రూ.12 వేలు, తల్లీబిడ్డలకు రూ.2 వేలు విలువైన ‘కేసీఆర్ కిట్’ ఇస్తున్నారు. స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదువు ఉచితంగా చెబుతున్నారు. తెలంగాణలో మా సుట్టాలు చాలామంది ఇలాంటి పథకాలతో లబ్ధిపొందుతున్నారు. మా దగ్గర ఎలక్షన్లు జరిగినప్పుడే నాయకులు వస్తారు. తర్వాత పట్టించుకోరు.
– వెంకటమ్మ, పండ్ల వ్యాపారి
దూరదృష్టి ఉన్న నేతతోనే దేశం బాగు
తెలంగాణ అంటే కేసీఆర్. ఉద్యమంలో చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు. మా అందరికీ ఆయన స్ఫూర్తి. తెలంగాణలో నాయీబ్రాహ్మణ, రజక వృత్తులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు. అనేక వర్గాలకు వారి కులవృత్తులను కాపాడుకునే రాయితీలు అందించి భరోసానిచ్చాడు. మాకు అవేవీ లేవు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకొస్తే దేశంలో నిజమైన సంస్కరణలు ప్రారంభమవుతాయి. ఆయన విజన్తో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుంది.
– మల్లికార్జున్, యాద్గిర్, సెలూన్ యజమాని