ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారికి ఓ భక్తుడు భూరీ విరాళం అందజేశాడు. వేయి గ్రాములకు పైగా బరువు ఉన్న మూడు బంగారు కిరీటాలను అమ్మవారికి సమర్పించుకున్నాడు. బంగారు కిరీటాల దాతకు ఆలయ ప్రధాన అర్చకుడు వేదాశీర్వచనం చేసి ప్రసాదం అందజేశారు.
నవీ ముంబైకి చెందిన జీ హరికృష్ణారెడ్డి విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు కిరీటాలను కానుకగా అందించాడు. దాదాపు 1308 గ్రాముల బరువున్న మూడు బంగారు కిరీటాలను కనకదుర్గ ఆలయ ఈఓ భ్రమరాంబకు అందజేశారు. వీటిని అమ్మవారి ఉత్సవ విగ్రహం అలంకరణకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. హరికృష్ణారెడ్డి నవీ ముంబైలో రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిలెడ్ సంస్థను నడుపుతున్నారు. అమ్మవారికి బంగారు కిరీటాలు కానుకగా ఇచ్చిన దాత హరికృష్ణారెడ్డిని ఆలయ ప్రధానార్చకులు వేదాశీర్వాదం చేశారు. అనంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రం అందజేసి అభినందించారు.