అమరావతి : కేంద్రంలో బీజేపీ (BJP) ని, రాష్ట్రంలో చంద్రబాబు(Chandra Babu) ను గెలిపిస్తే రెండు సంవత్సరాల్లో పోలవరం(Polavaram) ప్రాజెక్టును పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి అభ్యర్థుల తరుఫున నిర్వహించిన ప్రచార బహిరంగ సభలో చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఏపీలో అవినీతి, గుండాగిరి, భూమాఫియా నుంచి రక్షించేందుకు వచ్చామని పేర్కొన్నారు.
అమరావతి (Amaravati) ని రాజధానిగా పనులు చేపట్టి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను చంద్రబాబు ప్రథమస్థానంలో నిలిపారని ప్రశంసించారు. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా అటు రాహుల్గాంధీని, ఇటు జగన్ను ఆహ్వానించామని వారు హాజరు కాలేదని అటువంటి వారికి ఓటు వేసి గెలిపిద్దామా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన అనంతరం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడితే వైఎస్ జగన్ (YS Jagan) అధోగతి పట్టించారని విమర్శించారు. రూ. 13లక్షల కోట్ల అప్పులను చేసి అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. నిరుద్యోగంలో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని ఆరోపించారు. ల్యాండ్, ఇసుక మాఫియాతో రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. రాయలసీమను నిర్లక్ష్యం చేశారని కూటమి అధికారంలో తీసుకువస్తే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.