న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికల వరకూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డానే పార్టీ చీఫ్గా కొనసాగిచాలని కమలనాధులు భావిస్తున్నారు. నడ్డా వారసుడి కోసం ఎన్నికలు నిర్వహించేందుకు కాషాయ పార్టీ సుముఖంగా లేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా మూడేండ్ల పదవీకాలం 2023 జనవరితో ముగియనుంది. 2019 జులైలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నడ్డా ఆపై 2020 జనవరి 20న పూర్తికాల అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. బీజేపీ రాజ్యాంగం ప్రకారం పార్టీ అధ్యక్షుడు మూడేండ్ల చొప్పున వరుసగా రెండుసార్లు ఎన్నిక కావచ్చు.
రాష్ట్ర శాఖల్లో కనీసం సగం శాఖల ఎన్నికలు పూర్తయిన తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ చేపట్టవచ్చు. ఇక ఏడాది చివర గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2023లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, 2024లో లోక్సభ ఎన్నికల నేపధ్యంలో నడ్డాను పార్టీ చీఫ్గా కొనసాగించాలని మోదీ, షాలు నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.