Jogu Ramanna | ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు జిల్లాలోని ఇతర బీఆర్ఎస్ నాయకులను సైతం అదుపులోకి తీసుకున్నారు.
రేపు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేస్తున్నారు. ఇదే సమయంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇవాళ జరగనుంది. ఈ ఎన్నికలలకు పరిశీలకులిగా జోగు రామన్న వ్యవహరిస్తుండగా.. పోలీసులు ఆయన్ను ముందస్తుగా అరెస్టు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోలీసుల చర్యలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా నిర్బంధాలకు గురి చేసినా.. తాము ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖను తన దగ్గర ఉంచుకుని ప్రశ్నించే గొంతులను అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నారని జోగు రామన్న విమర్శించారు. ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దాహంతో ప్రభావితం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికమని అన్నారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక బీఆర్ఎస్కు అనుకూలంగా మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి కుట్రపూరిత చర్యలకు దిగజారిందని అన్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.