Petrol Price | పెట్రోల్ ధరలను భారీగా పెంచిన మరుసటి రోజే పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో లీటర్ పెట్రోల్పై పాకిస్థాన్ రూ.80 మేర తగ్గించింది. ఈ మేరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో పెట్రోల్ ధర లీటర్కు 378 PKRకి చేరింది. తగ్గిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. నిన్ననే పెట్రోలుపై సుమారు 43 శాతం, హైస్పీడ్ డీజిల్పై సుమారు 55 శాతం వరకు పెంచింది. దీంతో పెట్రోల్ ధర లీటర్కు 321.17 PKR నుంచి రూ.458.41 PKRకి చేరింది. ఇక పెట్రోలియం లేవీ 105 PKR నుంచి రూ.160 PKRకి పెరిగింది. అయితే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో వెనక్కి తగ్గిన పాక్ సర్కార్.. రూ.80 మేర తగ్గించింది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని షరీఫ్ తెలిపారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి దగ్గర సరఫరా అంతరాయం కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు పెరగడంతో ఈ పరిస్థితి వచ్చిందని షరీఫ్ తెలిపారు. అయితే సాధారణ ప్రజలపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. గత మూడు వారాలుగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పటికీ వాటిని పూర్తిగా వినియోగదారులపై మోపకుండా సబ్సిడీలు అందించామని చెప్పారు.
పెట్రోల్ ధరలను తగ్గించడంతో పాటు ప్రజలకు మరింత ఉపశమనం కలిగించేందుకు పాక్ ప్రధాని పలు రాయితీలు ప్రకటించారు. ద్విచక్రవాహనదారులకు లీటర్కు 100 PKRసబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. నెలకు గరిష్ఠంగా 20 లీటర్ల వరకు మూడు నెలల పాటు ఈ ప్రయోజనం అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఇస్లామాబాద్ సహా పాక్లోని ముఖ్య ప్రాంతాల్లో ఒక నెలపాటు ప్రజా రవాణాను ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. పాక్ రైల్వేలో ఎకానమీ క్లాస్ ప్రయాణికుల చార్జీలను పెంచబోమని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, పెట్రోల్ ధరలను తగ్గించిన పాక్.. డీజిల్ ధరలను మాత్రం యథాతథంగా 520 PKR వద్దే ఉంచడం గమనార్హం.