ముంబై, నవంబర్ 25: అటు పారిశ్రామికంగా, ఇటు వాణిజ్యపరంగా డ్రోన్ల వినియోగానికి పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా.. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కూడా వీటికి బీమా కవరేజీని తీసుకొచ్చింది. డీప్-టెక్ స్టార్టప్ ట్రొపొగొ భాగస్వామ్యంతో ఈ బీమాను అందిస్తున్నట్లు గురువారం బజాజ్ అలియాంజ్ తెలియజేసింది. ఇప్పటికే హెచ్డీఎఫ్ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్, టాటా ఏఐజీలు డ్రోన్లకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది జూన్లో తొలుత హెచ్డీఎఫ్సీ ఎర్గో డ్రోన్లకు బీమా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగా, ఈ ఏడాది ఆగస్టులో ఐసీఐసీఐ లాంబార్డ్, అక్టోబర్లో టాటా ఏఐజీలు బీమాను ప్రకటించాయి. ఇప్పుడు తాజాగా బజాజ్ అలియాంజ్ కూడా వీటి సరసన చేరింది. దీంతో డ్రోన్లకు బీమా కవరేజిని ఇస్తున్న నాల్గో ఇన్సూరెన్స్ కంపెనీగా నిలిచింది. డీజీసీఏ అనుమతులకు లోబడి డ్రోన్లకు బీమా కవరేజీ వర్తించనున్నది. కాగా, డ్రోన్ డ్యామేజీకి, డ్రోన్ తీసుకెళ్తున్న వస్తూత్పత్తులు ఇతరత్రా వాటికి ఈ బీమా ఉంటుందని బజాజ్ అలియాంజ్ తెలియజేసింది. బీమా కింద కొత్తది ఇవ్వడమో, రిపేర్ చేయడమో జరుగుతుంది. ఇక థర్డ్-పార్టీ లయబిలిటితోపాటు బియాండ్ ది విజువల్ లైన్ ఆఫ్ సైట్ (బీవోఎల్వోఎస్) ఎండార్స్మెంట్, నైట్ ఫ్లైయింగ్ ఎండార్స్మెంట్లకూ అదనపు కవరేజీ వస్తుంది.