అమరావతి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై రెండు సంవత్సరాల తరువాత పూర్తిస్థాయి దసరా ఉత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల తొలిరోజు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మూల నక్షత్రం రోజున ఏపీ సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు పదిరోజుల పాటు జరిగే ఉత్సవాలకు 14 లక్షల మంది భక్తులు రావొచ్చని భావిస్తున్నారు. రోజుకు 60వేల మంది భక్తులు రావొచ్చని అంచనావేస్తున్నారు.
ముఖ్యంగా అక్టోబర్ 2వ తేదీన మూలా నక్షతం రోజున రెండు లక్షల మందికి పైగా వచ్చే అవకాశం ఉండడం తో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆన్లైన్లో రూ. 100, రూ.300 ల టిక్కెట్లను, వీఐపీలకు రూ.500 ల టిక్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆలయానికి సమీపంలోని కృష్ణా నది ఉదృతంగా ఉండడంతో నదిలో భక్తులు దిగకుండా జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశారు.
సీతమ్మవారి పాదాల నుంచి దోబీఘాట్ వరకు 500, పున్నమి ఘాట్లో రెండు వందలు, భవానీ ఘాట్లో వంద కలిపి మొత్తం 800 జల్లు స్నానాలు ఏర్పాట్లు చేశారు. భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు గాను రెండువందల మంది క్షురకులను ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాలకు 20లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఇందుకుగాను ప్రత్యేక కౌంటర్లను ఏర్పాట్లు చేశారు.