బాలి: ప్రపంచ చాంపియన్ పీవీ సింధు ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో మూడో సీడ్ సింధు 21-12, 21-18తో వొన్ని లీ (జర్మనీ)పై విజయం సాధించింది. 37 నిమిషాల్లోనే ముగిసిన పోరులో సింధు.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ ఓటమి పాలవగా.. సాయి ప్రణీత్ క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్స్లో సాయి ప్రణీత్ 21-17, 14-21, 21-19తో క్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్)పై గెలుపొందగా.. శ్రీకాంత్ 14-21, 18-21తో ఒలింపిక్ చాంపియన్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి పాలయ్యాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ 21-15, 19-21, 23-21తో కాంగ్ మిన్యాక్-సియో సియెంగ్జె (కొరియా) జంటపై గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరుగనున్న మహిళల క్వార్టర్ ఫైనల్లో సిమ్ యూజిన్ (దక్షిణ కొరియా)తో సింధు.. పురుషుల క్వార్టర్స్లో రెండో సీడ్ అక్సెల్సెన్తో సాయిప్రణీత్ తలపడనున్నారు.