న్యూఢిల్లీ : చంద్రయాన్ 3 విజయవంతమైన నేపధ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలను కలిసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూర్ను సందర్శించిన క్రమంలో ప్రొటోకాల్ నిబంధనలను విస్మరించడంపై కాంగ్రెస్ మండిపడింది. ప్రొటోకాల్ రగడపై ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ గతంలో జరిగిన ఘటనను ప్రస్తావించారు.
1983లో ఎస్ఎల్వీ-3-డీ2ను విజయవంతంగా లాంఛ్ చేసిన అనంతరం నాటి ప్రధాని ఇందిరా గాంధీ అప్పటి ఏపీ సీఎం ఎన్టీ రామారావును శ్రీహరికోటకు ఆహ్వానించారని గుర్తుచేశారు. ఇద్దరూ రాజకీయ ప్రత్యర్ధులైనా ప్రొటోకాల్ను నాటి ప్రధాని ఇందిరా గాంధీ అనుసరించారని ట్విట్టర్ వేదికగా జైరాం రమేష్ పేర్కొన్నారు.
ఇస్రో సైంటిస్టులను కలిసేందుకు ప్రధాని మోదీ ఇటీవల బెంగళూర్కు రాగా, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్లను విమానాశ్రయంలో ఆయనను రిసీవ్ చేసుకునేందుకు రానివ్వకుండా నిరోధించారని జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. ఇది ప్రొటోకాల్ను ఉల్లంఘించడమేనని ఆయన ఆరోపించారు. అయితే ఉదయాన్నే వారిని విమానాశ్రయానికి రప్పించి ఇబ్బందులకు గురిచేయడం ఇష్టం లేకనే తాను వారిని ఎయిర్పోర్ట్కు రాకుండా వారించానని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
Read More :
Suprem Court | ఆర్టికల్ 35A భారతీయుల ప్రాథమిక హక్కులను లాగేసుకుంది: సుప్రీంకోర్టు