న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 35A జమ్ముకశ్మీర్లో నివాసం ఉండని పౌరుల ప్రాథమిక హక్కులను లాగేసుకుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 35A జమ్ముకశ్మీర్లో నివసించని ప్రజలకు కొన్ని కీలక రాజ్యాంగ హక్కులను లేకుండా చేసిందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని సమాన అవకాశాలు, ఉద్యోగాలు, భూమి కొనుగోలు హక్కులను ఈ ఆర్టికల్ పౌరుల నుంచి దూరం చేసిందని పేర్కొన్నారు.
ఈ ఆర్టికల్ జమ్ముకశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు కల్పించడం వల్ల రాష్ట్రేతరులు ఆ హక్కులను కోల్పోయారని కోర్టు పేర్కొంది. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై 11వ రోజు విచారణ సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించే 16(1), దేశంలో ఎక్కడైనా నివసించే, స్థిరపడే హక్కును కల్పించే ఆర్టికల్ 19(1)(e), ఆస్తి కొనుగోలు, వృత్తి వ్యాపారం చేయగల స్వేచ్ఛ 9(1)(f) లాంటి మూడు ప్రాథమిక హక్కులను 35A అధికరణ హరించిందని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. జమ్ముకశ్మీర్లోని శాస్వత నివాసితులు, ఇతర నివాసితుల మధ్య మాత్రమే కాకుండా దేశంలోని ఇతర పౌరుల మధ్య కూడా ఆర్టికల్ 35A వ్యత్యాసాన్ని సృష్టించిందని తెలిపారు. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం ద్వారా దేశం మొత్తాన్ని ఏకరీతిన ఉంచిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370ని తొలగించక ముందు భారత రాజ్యాంగంలో చేసిన ఏ సవరణ కూడా జమ్ముకశ్మీర్కు వర్తించేది కాదన్నారు. కాగా, ఆర్టికల్ 370తోపాటు ఆర్టికల్ 35Aను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టులో రద్దు చేసింది.