Indigo | దేశీయ పౌర విమానయాన రంగంలో ఎయిర్ లైన్స్ మధ్య పోటీ మొదలైంది. టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియాతో పోటీ పడేందుకు ఇండిగో ముందుకు వచ్చింది. గతేడాది ఒకేసారి ఎయిర్ బస్ నుంచి 500 విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టడంతో చరిత్ర నెలకొల్పింది. తాజాగా మరో 30 వైడ్ బాడీ విమానాల కోసం ఎయిర్ బస్ కు ఆర్డర్ పెట్టింది. తద్వారా టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియాకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. వైడ్ బాడీ విమానాల కొనుగోలు చారిత్రాత్మక క్షణం అని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. కొత్త విమానాల కొనుగోలుతోపాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరో 70 ఎయిర్ బస్ ఏ350 విమానాల కొనుగోలు హక్కులు పొందామన్నారు. ఈ విమానాల కొనుగోలుతో ప్రపంచంలోని ప్రధాన గమ్యస్థానాలకు మెట్రో నగరాలను అనుసంధానిస్తామని ఇండిగో తెలిపింది.
ప్రస్తుతం 350కి పైగా నారో బాడీ విమానాలు నడుపుతున్న ఇండిగో.. టుర్కిష్ ఎయిర్ లైన్ష్ వద్ద బోయింగ్ 777 విమానాలను లీజుకు తీసుకుని నడుపుతున్నది. దేశంలో ప్రస్తుతం ఎయిర్ ఇండియా మాత్రమే ఏ350 విమానాలు కలిగి ఉంది. ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్.. వైడ్ బాడీ విమానాలు నడుపుతుండగా, స్పైస్ జెట్ కొన్ని విమానాలను లీజుకు తీసుకుని నడుపుతున్నది. ఈ తరుణంలో అంతర్జాతీయంగా తన ఉనికిని విస్తరించేందుకు ఎయిర్ బస్ నుంచి మరో 30 ఏ350-900 విమానాలను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ పెట్టింది. 2027 నుంచి ఈ విమానాల డెలివరీ ప్రారంభం అవుతుంది.