న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రెండు కోట్ల మార్క్ను దాటగా.. వరుసగా మూడో రోజు కేసులు కాస్త తగ్గాయి. 24 గంటల్లో 3,57,229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్రం కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్తగా 3,449 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు విడిచారు. తాజాగా 3,20,289 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,82,833కు పెరిగింది. ఇప్పటి వరకు 1,66,13,292 మంది కోలుకున్నారు.
మహమ్మారి బారినపడి మొత్తం 2,22,408 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 34,47,133 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు టీకా డ్రైవ్లో భాగంగా 15,89,32,921 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. నిన్న ఒకే రోజు 16,63,742 టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 29.33 కోట్ల పరీక్షలు చేసినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో అమెరికా తర్వాత భారత్లోనే రెండు కోట్ల కేసులు నమోదయ్యాయి.