హైదరాబాద్ : రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్లతో వర్షం కురుస్తుందని పేర్కొంది. ఆదిలాబాద్, కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ రూరల్, అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలు చోట్ల వానలు పడే అవకాశం ఉన్నదిన పేర్కొన్నది.
ఇదిలా ఉండగా.. ఉపరితల ద్రోణి ప్రభావంతో సోమవారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట, వికారాబాద్, హైదరాబాద్లోని ఆసిఫ్నగర్, శేరిలింగంపల్లిలో దాదాపు 5 సెంటీమీటర్ల చొప్పున, ములుగు జిల్లా ఆలుబాక, ఆదిలాబాద్ జిల్లా బోథ్, సొనాల, నిర్మల్ జిల్లా ముథోల్, భైంసా, కుబీర్, సారంగాపూర్, నిజామాబాద్ జిల్లా దర్పల్లి, కమ్మర్పల్లి, జగిత్యాల జిల్లా జగ్గాసాగర్ తదితర ప్రాంతాల్లో దాదాపు 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది. సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచడంతోపాటు పిడుగులు పడ్డాయి. వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గాయి.