Pakistan | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. దేశ ఆర్థిక పరిస్థితి గాడిన పెట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో పాక్ ఆర్థిక పరిస్థితిపై ఆ దేశ నేత ఆందోళన వ్యక్తం చేశారు. పాక్లో నెలకొన్న పరిస్థితుల్ని భారత్తో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంచలంచలుగా అభివృద్ధి చెందుతున్న భారత్ తీరును కొనియాడారు.
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ (Maulana Fazlur Rehman) సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగించారు. పొరుగు దేశం భారత్ ‘ప్రపంచ సూపర్ పవర్’గా (India aiming to be superpower) మారేందుకు ప్రయత్నిస్తుంటే.. మనం మాత్రం దివాలా తీయకుండా ఐఎంఎఫ్ని నిధులు అడుక్కుంటున్నాం (Pak beg for funds) అంటూ వ్యాఖ్యానించారు. ‘పొరుగు దేశం భారత్తో మనల్ని పోల్చుకోండి. ఆగస్టు 1947లో రెండు దేశాలూ ఓకే రోజు స్వాతంత్రం పొందాయి. ఈ రోజు భారత్ ప్రపంచ సూపర్ పవర్గా మారాలని కలలు కంటోంది. మనం మాత్రం దివాలా తీయకుండా ఉంటే చాలని ప్రయత్నిస్తున్నాము. ఈ పరిణామాలకు బాధ్యులెవరు..?’ అంటూ పాక్ ఆర్థిక పరిస్థితిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘రాజభవనాల్లో ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రధాన మంత్రి ఎవరనేది బ్యూరోక్రాట్లు నిర్ణయిస్తారు. మనం ఎంతకాలం రాజీపడాలి..? చట్టసభ సభ్యులుగా ఎన్నుకోబడటానికి బాహ్య శక్తుల నుంచి ఎంతకాలం సహాయం కోరుకుంటాం..?’ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.
కాగా, పాక్ ఆర్థిక పరిస్థితిపై ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పొరుగు దేశమైన భారత్ (India) అన్ని రంగాల్లోనూ పురోగమిస్తుంటే.. పాకిస్థాన్ పరిస్థితి మాత్రం నానాటికీ దిగజారుతోందన్నారు. భారత్ చందమామను చేరుకోవడంతోపాటు ప్రతిష్ఠాత్మక జీ20 సమావేశాలను నిర్వహించిందన్నారు. అయితే పాక్ మాత్రం అడుక్కునే స్థితికి చేరిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్థాన్ ప్రధాని నేడు ఆ దేశానికి, ఈ దేశానికి తిరుగుతూ నిధుల కోసం అడుక్కుంటున్నారు. భారత్ మాత్రం అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తోంది. చంద్రుడిని చేరింది. ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సుకు ఆతిథ్యమిచ్చింది. భారత్ చేయగలిగింది పాకిస్థాన్ ఎందుకు చేయలేకపోతోంది..? ఈ దారుణ పరిస్థితులకు ఎవరు బాధ్యులు..?’ అని సూటిగా ప్రశ్నించారు. పాక్ ఆర్థికంగా బలహీనపడడానికి భారత్ కానీ, అమెరికా కానీ కారణం కాదని అన్నారు. మన విధానాలే మనల్ని ఆర్థిక సంక్షోభం దిశగా తీసుకువెళ్లినట్లు ఆయన చెప్పారు. శక్తివంతమైన సైన్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ తరపు టికెట్లు ఆశిస్తున్న వారితో జరిగిన సమావేశంలో నవాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read..
Amit Shah | రిజర్వేషన్లను మా పార్టీ ఎప్పటికీ తొలగించదు.. ఫేక్ వీడియోపై అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్